ఇంగ్లండ్ పై టీమిండియా కావాలనే ఓడిపోయింది

ఇంగ్లండ్ పై టీమిండియా కావాలనే ఓడిపోయింది

పాక్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్
న్యూఢిల్లీ: గతేడాది వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఇండియా కావాలనే ఓడిపోయిందని పాక్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ సెమీస్ కు క్వాలిఫై కావొద్దనే ఉద్దేశ్యంతో ఆ మ్యాచ్ లో ఇండియా కావాలనే ఓడిపోయిందని విమర్శించాడు. ఓ పాకిస్తాన్ న్యూస్ చానెల్ నిర్వహించిన షోలో రజాక్ మాట్లాడాడు. ‘ఆ మ్యాచ్ ను చూస్తున్నప్పుడు మేం అందరం అదే విధంగా భావించాం. దీనిపై టీమిండియాకు ఐసీసీ ఫైన్ వేయాలి. ఏదైనా టీమ్ క్వాలిఫై కావొద్దనే ఉద్దేశ్యంలో కావాలనే మ్యాచ్ ఓడిపోతే సదరు జట్టుకు ఫైన్ విధించాల్సిందే. క్వాలిటీ బౌలర్స్ తమ స్టాండర్డ్స్ కు తగ్గట్లుగా బౌలింగ్ వేయకపోతే, లైన్ అండ్ లెంగ్త్ ప్రకారం బాల్స్ వేయకుండా ఎక్కువగా రన్స్ ఇచ్చినప్పుడు ఎవరికైనా అర్థమైపోతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇండియా కావాలనే ఆ మ్యాచ్ లో ఓడిపోయింది. ఆ టైమ్ లో కూడా నేను ఈ విషయాన్ని చెప్పా. ప్రతి క్రికెటర్ అలాగే ఫీల్ అయ్యారు కూడా. ఫోర్ లేదా సిక్స్ కొట్టగల సత్తా ఉన్న ప్లేయర్ డిఫెన్స్ ఆడుతుంటే అర్థమైపోతుంది కదా’ అని రజాక్ చెప్పాడు. పాకిస్తాన్ ను నాకౌట్ స్టేజ్ కు రాకుండా చేయడానికే ఇండియా ఆ మ్యాచ్ లో ఓడిపోయిందని ఆ టీవీ షోలో పాల్గొన్న పాక్ మాజీ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ కూడా విమర్శించాడు.