రాష్ట్రంలో పాలన నడవట్లే..సీఎం ప్రగతి భవన్ లో ఉండట్లే..

రాష్ట్రంలో పాలన నడవట్లే..సీఎం ప్రగతి భవన్ లో ఉండట్లే..
  • సెక్రటేరియట్ కూల్చే పనిలో సీఎస్, డీజీపీ
  • ఆఫీసుల్లో కనిపించని స్టాఫ్​, అటకెక్కిన ఫైళ్లు
  • సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం అవస్థలు

రాష్ట్రంలో పాలన నడుస్తలేదు. సెక్రటేరియట్ షిఫ్టింగ్ నుంచి మొదలైన ఈ పరిస్థితి.. కరోనా ముట్టడి తర్వాత మరింత అదుపు తప్పింది. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఆఫీసర్లు ఎప్పుడు ఎక్కడ ఉంటరో కనుక్కోవడం ఎమ్మెల్యేలకు కూడా చాలెంజ్ గా మారింది. సీఎం ఆఫీసు, సెక్రటేరియట్, కమిషనరేట్స్, కలెక్టరేట్స్.. ఇట్ల  అంతటా ఇదే పరిస్థితి. కరోనా భయంతో కొందరు మినిస్టర్లు, ఆఫీసర్లు బయటకు రావడమే మానేశారు. ఒకవేళ వచ్చినా.. అట్లొచ్చి ఇట్లపోతున్నారు. విజిటర్స్ ను కలవడం లేదు. ఆఫీసులకు ఉద్యోగులు సగం మందే వస్తున్నారు. ఆ వచ్చినవాళ్లు కూడా కొద్ది సేపటికే వెళ్లిపోతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్​ డే  ఆగిపోయింది. దీంతో కరోనా టైంలో తమ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలని జనం అడుగుతున్నారు.

హైదరాబాద్, వెలుగుఏడాది నుంచి రాష్ట్రంలో పాలన గందరగోళంగా తయారైంది. ఎవరికి అర్జీలు ఇవ్వాలో తెలియడం లేదని.. ఏ ఆఫీసర్​, ఏ మంత్రి ఎక్కడ ఉంటారో అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు. కరోనా టైంలో తమను పట్టించుకునే దిక్కులేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్​ డే  కూడా కరోనా కారణంగా పూర్తిగా నిలిచిపోయింది. పాత సెక్రటేరియట్​లో పాలన కొనసాగినన్ని రోజులు ప్రతి రోజు సాయంత్రం ఒక గంట పాటు విజిటర్లకు అనుమతి ఉండేది. ఇప్పుడు ఆఫీసులు పుట్టకొకటి చెట్టుకొకటి కావడంతో ప్రజలు తమ అర్జీలను అందించే అవకాశం లేకుండా పోయింది. 12 రోజులుగా సీఎం కేసీఆర్​ ఎర్రవల్లిలోని తన ఫామ్​హౌస్​లోనే ఉండటంతో అత్యవసర సమావేశాలన్నీ అక్కడే జరుగుతున్నాయి. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్​ ఆఫీసర్లు ఎర్రవల్లికి వెళ్లడానికే ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తోంది. రెండు రోజులుగా సీఎస్, డీజీపీ.. సెక్రటేరియట్ బిల్డింగ్ కూల్చివేత పనులపైనే ఎక్కువగా ఫోకస్​ పెట్టారు.

ప్రగతిభవన్​కు పాలన మారినప్పటి నుంచే..!

సెక్రటేరియట్ నుంచి జరగాల్సిన అడ్మినిస్ట్రేషన్ ప్రగతి భవన్ కేంద్రంగా షిఫ్ట్​ అయినప్పటి నుంచి గాడి తప్పిందన్న అభిప్రాయాలు ఐఏఎస్ వర్గాల్లో ఉన్నాయి. ఒకే చోట నుంచి పాలన జరిగితే.. సమస్య వచ్చిన వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించే చాన్స్ ఉండేది. కొన్నాళ్లుగా అలాంటి పరిస్థితి లేకుండా పోయిందని, ప్రగతిభవన్ అడిగిన సమాచారాన్ని, ఫైల్స్ ను మాత్రమే పంపాల్సి వస్తోందని అధికార వర్గాలు అంటున్నాయి.

సెక్రటేరియట్ వాస్తు పరంగా లేదని ప్రగతిభవన్  నిర్మించారు. ఆ తర్వాత అదే అడ్మినిస్ట్రేషన్ సెంటర్ గా మారింది. అక్కడే కేబినెట్ మీటింగ్స్, రివ్యూలు, కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు వచ్చినా అక్కడే మీటింగ్స్ జరుగుతున్నాయి. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రజలు నేరుగా తమ సమస్యలను చెప్పుకునే  సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పడింది.

సెక్రటేరియట్ షిఫ్టింగ్ తో  కన్ఫ్యూజన్  స్టార్ట్​

దాదాపు ఏడాది క్రితం సెక్రటేరియట్​ను బీఆర్కే భవన్​కు షిఫ్ట్​ చేశారు. బీఆర్కే భవన్​లో సరిపోయేంత స్థలం లేకపోవడంతో అన్ని శాఖలకు గదులు కేటాయించలేదు. కొన్ని ఆఫీసులను బయటికి పంపించారు. సీఎం ఆఫీస్​ను బేగంపేట లో ఏర్పాటు చేశారు. మంత్రులు కూడా ఒక్కొక్కరూ ఒక్కో చోట చాంబర్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో సెక్రటేరియట్​కు, సీఎం ఆఫీస్​కు లింక్​ తెగిపోయింది. సెక్రటేరియట్​ (బీఆర్కే భవన్​)లోని ఏదైనా డిపార్ట్​మెంట్ కు చెందిన అంశంపై  ఏం జరుగుతుందో సీఎం ఆఫీసుకు..  సీఎం ఆఫీసులో ఏం జరుగుతుందో బీఆర్కే భవన్​కు తెలియని పరిస్థితి. ఇదే టైంలో కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చింది. దీంతో  అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా పక్కకు పోయినట్లయిందని ఆఫీసర్లు అంటున్నారు.

సమస్యలు ఎవరికి చెప్పుకోవాలె..?

లాక్ డౌన్  టైంలో అన్ని ఆఫీసులకు సెలవు ప్రకటించారు. ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే పనిచేశాయి. లాక్ డౌన్ సడలింపులు ప్రకటించి నెలరోజులవుతున్నా పూర్తిగా ఏ ఆఫీసు పనిచేయడం లేదు. మినిస్టర్లు తమ ఆఫీసులకు వచ్చేందుకు జంకుతున్నారు. చాలా ఆఫీసుల్లో కొందరికి వైరస్ సోకడంతో మిగతా స్టాఫ్​ ఆఫీసుకు రావాలంటే భయపడుతున్నారు. దీంతో సగం స్టాఫ్​ మాత్రమే డ్యూటీకి వస్తున్నారు. వచ్చిన కొద్ది మంది కూడా ప్రజల అర్జీలను తీసుకునేందుకు ఇంట్రస్ట్ చూపడం లేదు. దీంతో ప్రజల సమస్యలను పరిష్కరించే నాథుడే కరువయ్యాడు. ఇటీవల ఎక్కువ కరెంట్ బిల్లులు వచ్చాయని ప్రజలు ఆందోళన చెందారు. పరిష్కారం కోసం ఆఫీసుకు వెళ్తే ఎవరు ఉండటం లేదన్న ఆరోపణలు వచ్చాయి.  తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు రూ. 1500 సాయాన్ని లాక్​డౌన్​ టైంలో ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 6 లక్షల మందికి ఈ సాయం అందలేదు. పరిష్కారం కోసం ఎవర్ని  సంప్రదించాలో ప్రజలకు అర్థంకాని పరిస్థితి ఎదురైంది. కరోనా వల్ల తాము పడుతున్న కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో బాధితులకు దిక్కుతోచడం లేదు. దీంతో సోషల్  మీడియా వేదికగా ప్రజలు సెల్ఫీ వీడియోలు పోస్టు చేసి తమ సమస్యలను వెల్లడిస్తున్నారు. ఇటీవల కరోనా కట్టడిపై ఉన్నతాధికారులతో సమీక్షించనున్నట్లు గవర్నర్ పెట్టిన ట్వీట్​ను చూసిన నెటిజన్లు..  ప్రభుత్వం  ప్రజారోగ్యాన్ని పట్టించుకోవటం లేదని, హైదరాబాద్​లో పరిస్థితి దారుణంగా ఉందని గోడు వెళ్లబోసుకున్నారు.

చదువుల్ని పట్టించుకోని సర్కారు

రాష్ట్రంలో 110 రోజులుగా సర్కారు, ప్రైవేటు స్కూళ్లు మూతపడ్డాయి. 2019-–20 అకడమిక్​ ఇయర్​ అర్ధంతరంగా ముగిసింది. ఇదే అదనుగా కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు ఆన్​లైన్​ క్లాసుల పేరుతో ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్​ లేదు. ఇంటర్​ అడ్వాన్డ్స్​ సప్లిమెంటరీపై ఇప్పటికీ అతీగతి లేదు. ఉంటాయో లేదో కూడా ప్రభుత్వం చెప్పడం లేదు. డిగ్రీ అడ్మిషన్లు నిర్వహించాలని షెడ్యూల్​ ప్రకటించినా.. ఇప్పటికీ ఈడబ్ల్యూఎస్​ , మేనేజ్​మెంట్ కోటాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. దీంతో డిగ్రీ అడ్మిషన్ల ప్రాసెస్​ ఆగిపోయింది. మరోపక్క డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్షలూ వాయిదా పడ్డాయి. వీటిని రద్దు చేయాలని ఆఫీసర్లు సర్కారుకు నివేదిక ఇచ్చారు. అయినా ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్​కు పరీక్షలు పెట్టాలని యూజీసీ సూచించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెస్పాన్స్​ లేదు. వివిధ కోర్సుల్లో ఎంట్రెన్స్​ టెస్టులపైనా ఇదే పరిస్థితి. దీంతో స్టూడెంట్స్, పేరెంట్స్​ ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణలో మరో 1924 మందికి కరోనా