ఏడాదిగా ఆన్‌లైన్‌‌ లోనే షాపింగ్

ఏడాదిగా ఆన్‌లైన్‌‌ లోనే షాపింగ్
  • లోకల్ షాపులు, మాల్స్‌‌లలో తగ్గిన సేల్స్‌‌‌‌
  • హోమ్‌‌ డెలివరీ ఉంటే స్టోర్లు, రిటైలర్లయినా ఓకే 
  • గత ఏడాది కాలంలో షాపింగ్ ట్రెండ్స్‌‌ను బయటపెట్టిన లోకల్‌‌ సర్కిల్స్‌‌ 

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: ఆన్‌‌లైన్‌‌లో షాపింగ్‌‌ చేయడం బాగా పెరుగుతోంది. లోకల్ షాపులు, రిటైలర్ల నుంచి కాకుండా ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌కే కన్జూమర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది కాలంలో దేశంలో షాపింగ్ ట్రెండ్ ఎలా ఉందో   లోకల్‌‌ సర్కిల్స్‌‌ సర్వే చేసింది. కరోనా వలన ప్రజల అలవాట్లు మారాయని ఈ సర్వే పేర్కొంది. లోకల్‌‌ మార్కెట్లు, రిటైల్‌‌ స్టోర్లు, మాల్స్‌‌ తిరిగి ఓపెన్‌‌ అయినప్పటికీ ఆన్‌‌లైన్‌‌ షాపింగ్ విధానాన్నే ఫాలో కావాలని ఎక్కువ మంది కన్జూమర్లు చూస్తున్నారు. ఈ సర్వేలో పాల్గొన్న రెస్పాండెంట్లలో సగం మంది గత ఏడాది కాలం నుంచి ఈ–కామర్స్ వెబ్‌‌సైట్లు, యాప్‌‌ల ద్వారానే షాపింగ్‌‌ చేస్తున్నామని పేర్కొన్నారు. హోమ్ డెలివరీ చేసిన లోకల్ రిటైలర్ల నుంచి కొనుగోలు చేశామని 18 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. 31 శాతం మంది రెస్పాండెంట్లు మాత్రం మాల్స్‌‌, మార్కెట్లు, లోకల్ రిటైలర్ల వద్ద షాపింగ్ చేశామని చెప్పారు.  2 శాతం మంది రెస్పాండెంట్లు మాత్రం చెప్పలేమన్నారు.
ఆన్‌‌లైన్‌‌లో గ్రోసరీ కొనుగోళ్లు పెరిగాయ్‌‌.. 
గత 12 నెలల్లో గ్రోసరీ, అత్యవసరమైన ప్రొడక్ట్‌‌లను ఎక్కువగా కొనడానికి కన్జూమర్లు ఆన్‌‌లైన్ బాట పట్టారు. సర్వేలో పాల్గొన్న రెస్పాండెంట్లలో 69 శాతం మంది ఈ కేటగిరీ ప్రొడక్ట్‌‌లను కొన్నామని సమాధానమిచ్చారు. క్లాత్స్‌‌,  ఎలక్ట్రానిక్‌‌ యాక్సెసరీస్ వంటి మీడియం వాల్యూ ప్రొడక్ట్‌‌లను  కొన్నామని 54 శాతం మంది రెస్పాండెంట్లు, గ్యాడ్జెట్లు, వైట్‌‌ గూడ్స్‌‌, ఫర్నిచర్ వంటి ధర ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్‌‌లను కొన్నామని 32 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో పైన పేర్కొన్న కేటగిరీ ప్రొడక్ట్‌‌లను ఎక్కువగా కొన్నారని ఈ సర్వే తెలిపింది. ‘గత 12 నెలల్లో కన్జూమర్ల అలవాట్లలో మార్పులొచ్చాయి. వర్క్‌‌ఫ్రమ్‌‌ హోమ్‌‌, ఆన్‌‌లైన్ ఎడ్యుకేషన్‌‌ విధానాలు పెరగడంతో ల్యాప్‌‌టాప్‌‌లు, స్మార్ట్ డివైజ్‌‌లు, హెడ్‌‌ఫోన్లు వంటి ప్రొడక్ట్‌‌లకు ఎక్కువ డిమాండ్ క్రియేట్‌‌ అయ్యింది. మాస్కులు, శానిటైజర్లు వంటి పర్సనల్ కేర్, వెల్‌‌నెస్‌‌  ప్రొడక్ట్‌‌లకు డిమాండ్‌‌ పెరగడం చూశాం’ అని అమెజాన్ ఉద్యోగి ఒకరు చెప్పారు. ఈ సర్వే ప్రకారం గత ఏడాది కాలంలో అవసరమున్న ప్రతీ ప్రొడక్ట్‌‌ను ఆన్‌‌లైన్‌‌లోనే కొన్నామని 33 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు. ఖర్చుల్లో 75 శాతం వాటాను మాత్రమే ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కోసం కేటాయించామని 29 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు.

తక్కువ రేట్లు..ఎక్కువ సేఫ్టీ 
ఫిజికల్ స్టోర్లతో పోలిస్తే ధరలు తక్కువగా ఉండడం, సేఫ్టీ, ఈజీగా ప్రొడక్ట్‌‌ను రిటర్న్‌‌ చేయగలగడం వంటి కారణాలతో ఈ–కామర్స్ సర్వీస్‌‌లకు కన్జూమర్లు ఆకర్షితులవుతున్నారని ఈ సర్వే పేర్కొంది. దేశంలోని 358 జిల్లాల్లో నివసిస్తున్న 42 వేల మంది కస్టమర్ల నుంచి 1.3 లక్షల రెస్పాన్స్‌‌లను లోకల్‌‌సర్కిల్స్‌‌ సేకరించింది. ‘కరోనా సంక్షోభం వలన బయ్యర్లు, సెల్లర్లు ఆన్‌‌లైన్‌‌కు వేగంగా షిప్ట్‌‌ అవుతున్నారు. కేవలం మెట్రోలే కాకుండా నాన్ మెట్రోలలో కూడా ఈ ధోరణి పెరుగుతోంది. ఎక్కువ ప్రొడక్ట్‌‌లు అందుబాటులో ఉండడంతో కన్జూమర్లు ఆన్‌‌లైన్ షాపింగ్‌‌కు ఇష్టపడుతున్నారు’ అని ఈ–కామర్స్‌‌ కంపెనీ స్నాప్‌‌డీల్‌‌ పేర్కొంది. క్వాలిటీ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్‌‌ల కోసం అధికంగా ఖర్చు చేసేందుకు కస్టమర్లు రెడీ అవుతున్నారని తెలిపింది.