కోల్కతా : పశువుల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన తృణమూల్ కాంగ్రెస్ బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రతా మండల్ను ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో సమస్య ఉందని చెప్పడంతో వెంటనే అతడిని వైద్య పరీక్షల నిమిత్తం కోల్కతాలోని కమాండ్ ఆసుపత్రికి తరలించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి అత్యంత సన్నిహితుడుగా పేరున్న అనుబ్రతా మండల్ను సీబీఐ గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 2020 నాటి పశువుల అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా మండల్ను అరెస్టు చేసింది. మండల్ను ప్రశ్నించేందుకు గతంలో సీబీఐ చాలాసార్లు సమన్లు జారీ చేసింది. అయితే.. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ కోల్కతా హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం అంగీకరించింది.
#WATCH | Kolkata, WB: TMC Birbhum District President Anubrata Mondal who was arrested by the CBI in a cattle smuggling case was taken to the Command Hospital in Kolkata for a medical checkup after he complained of a breathing problem pic.twitter.com/9hPp6c02sY
— ANI (@ANI) August 12, 2022
గత కొంతకాలంగా హైపోక్సియా(ఆక్సిజన్ కొరత) రుగ్మతతో బాధపడుతున్న అనుబ్రతా మండల్ ఎక్కడకు వెళ్లినా ఆక్సిజన్ సిలిండర్ను తన వెంట తీసుకెళ్తుంటారు. అయితే.. ఆయన హెల్త్ కండీషన్ ప్రస్తుతం బాగానే ఉందని, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని కోల్కతాలోని ఎస్ఎస్కెఎం ఆస్పత్రి డాక్టర్లు చెప్పడంతో మండల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.2020 నాటి పశువుల అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా గురువారం ఉదయం అనుబ్రతా మండల్ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఆయన్ను ఒక గదిలో దాదాపు గంటన్నరకు పైగా ప్రశ్నించారు. అయితే.. విచారణకు ఆయన సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేశామని సీబీఐ అధికారులు తెలిపారు.
ఎవరీ అనుబ్రతా మండల్..?
అనుబ్రతా మండల్ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ బీర్భమ్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 61 ఏళ్ల మండల్ బీర్భమ్ జిల్లాలో మంచి పట్టున్న రాజకీయ నాయకుడు. ఈ ప్రాంతంలో టీఎంసీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు గానూ పదింటిని టీఎంసీ కైవసం చేసుకుందంటే బీర్భమ్ జిల్లాలో అనుబ్రతా మండల్ కృషి ఉందంటారు. మమతా బెనర్జీకి వీర విధేయుడైన మండల్ టీఎంసీ జాతీయ వర్కింగ్ కమిటీలోనూ చోటు సంపాదించుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న అనుబ్రతా మండల్ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. తెర వెనుక నుంచి చక్రం తిప్పడానికే ఇష్టపడే ఆయన టీఎంసీ కీలక వ్యూహకర్తలో ఒకరిగా బాగా గుర్తింపు పొందారు.
మమతకు అత్యంత సన్నిహితుడు
అనుబ్రతా మండల్.. మమతకు అత్యంత సన్నిహితుడు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఇచ్చిన ‘ఖేలా హోబ్’ నినాదానికి ప్రాచుర్యం కల్పించారు. బీర్భమ్ జిల్లాలో టీఎంసీకి బాహుబలి తరహా నేతగా మండల్ ను పార్టీ వర్గాలు అభివర్ణిస్తాయి. పశువుల అక్రమ రవాణా కేసులో 2020లో సీబీఐ కేసు నమోదు చేయడంతో మండల్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి జిల్లాలో దర్యాప్తు సంస్థ ఇప్పటికే సోదాలు నిర్వహించింది. మండల్ అంగరక్షకుడిని అరెస్టు చేసింది.
తరచూ వివాదాల్లో మండల్..!
మరోవైపు చాలా సందర్భాల్లో రెచ్చగొట్టే ప్రకటనలతో అనుబ్రతా మండల్వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ సందర్భంలో పోలీసులపై బాంబులు వేయాలంటూ టీఎంసీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. చాలా మంది రౌడీషీటర్లకు ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. బీర్భూమ్ జిల్లాలో ఇసుక, రాళ్ల తవ్వకాలతో పాటు పశువుల అక్రమ రవాణాలోనూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు అనుబ్రతా మండల్పై ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు..కొద్దిరోజుల క్రితం మమతాబెనర్జీ కేబినెట్లో పనిచేసిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీని ఉద్యోగ నియామకాల కుంభకోణం కేసులో ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
#UPDATE | West Bengal: Central Bureau of Investigation (CBI) gets 10-day custody of TMC Birbhum district president Anubrata Mondal in the cattle smuggling case. https://t.co/iE0Ui4xTQ6
— ANI (@ANI) August 11, 2022