- దేశానికే ఆదర్శమైన పథకాలు రాష్ట్రంలో అమలైతున్నయ్
- ఎలుక లాంటి చుగ్.. సింహం లాంటి కేసీఆర్ను నాదిర్షాతో పోలుస్తరా?
- కాంగ్రెస్, బీజేపీ నేతలు కోతులు,
- కొండముచ్చుల్లా ప్రవర్తిస్తున్నారని కామెంట్
హైదరాబాద్, వెలుగు: దేశ ప్రజలు కేసీఆర్ను ప్రధానిగా చూడాలనుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శమైన ఎన్నో పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అమృత్సర్లో ఎమ్మెల్యేగా గెలవలేని తరుణ్ చుగ్కు కేసీఆర్ను విమర్శించే స్థాయి ఉందా? అని ప్రశ్నించారు. చుగ్ వయసు కేసీఆర్ రాజకీయ అనుభవమంతైనా లేదని విమర్శించారు. ‘‘ఎలుకలాంటి చుగ్.. సింహం లాంటి కేసీఆర్ను నాదిర్ షాతో పోలుస్తారా? అమిత్ షానే తెలంగాణ పాలిట నాదిర్ షా. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణపై దండెత్తుతున్నారు. కేసీఆర్ తెలంగాణ లోకల్..వోకల్. గుజరాత్ బేరగాళ్లతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిన పార్టీ.. ఇక్కడ గెలుస్తుందా? ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణానే. కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న కొందరు అష్ట దరిద్రులుగా మారిపోయారు’’ అని అన్నారు.
జగ్గారెడ్డి ప్రశ్నలకు రేవంత్ జవాబు చెప్పాలె
యాసంగి రైతుబంధు మంగళవారం నుంచి అమలవుతోందని, బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాల్లోనైనా అలాంటి స్కీం ఉందా? అని జీవన్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు కోతులు, కొండముచ్చుల్లా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కరోనా రూల్స్ కేంద్రం పెట్టినవేనని, వాటి గురించి సంజయ్, రేవంత్కు తెలియదా? అని ప్రశ్నించారు. అక్కరకు రాని విషయాలపై వాళ్లిద్దరూ రచ్చ చేస్తున్నారన్నారు. ఆ రెండు పార్టీల నేతలు నాంపల్లి బ్రదర్స్లా కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో హల్చల్ చేయడం తప్ప వాళ్లను జనం పట్టించుకోవడం లేదన్నారు. అబద్ధాలకు రేవంత్, అరాచకాలకు సంజయ్ ప్రతినిధులన్నారు. జగ్గారెడ్డి ప్రశ్నలకు రేవంత్ ఆన్సర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్కు 150 ఎకరాల భూమే లేదని, అలాంటప్పుడు అన్ని ఎకరాల్లో వరి వేశారనేది అబద్ధమన్నారు. రేవంత్ ఆత్మ బీజేపీ చుట్టే తిరుగుతోందన్నారు.