ఒకే రోజు 32 జిల్లాల్లో టీఆర్ఎస్ ఆఫీసులకు శంకుస్థాపన

ఒకే రోజు 32 జిల్లాల్లో టీఆర్ఎస్ ఆఫీసులకు శంకుస్థాపన

టీఆర్ఎస్ పార్టీ  కార్యవర్గ సమావేశం ముగిసింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం కల సాకారం చేసిన కెసిఆర్ ను  అభినందిస్తూ కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించిందన్నారు. 24 గంటల కరెంటు ,మిషన్ భగీరథలను విజయవంతం చేసినట్లే.. ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు  కాళేశ్వరాన్ని కూడా విజయంతంగా  ప్రారంభించబోతున్నామని అన్నారు.

అదే విధంగా ఈ నెల 24 న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల శంకుస్థాపన జరుగుతుందని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. దసరా లోపు ఈ భవనాల నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు. పార్టీకి  నిధుల ద్వారా వచ్చిన 19 కోట్ల 20 లక్షల రూపాయలను ఈ భవనాల నిర్మాణానికి వెచ్చిస్తామని అన్నారు. 27 న పార్టీ విస్తృత స్థాయి సమావేశం తెలంగాణ భవన్ లో జరుగుతుందని, అదే రోజు నుంచి సీఎం కేసీఆర్ సభ్యత్వ స్వీకరణతో రాష్ట్రమంతా పార్టీ సభ్యత్వం ప్రారంభమవుతుంది.

ఈ నెల 21 న కాళేశ్వర ప్రాజెక్టు ప్రారంభోత్సవం  రోజున  రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ,కార్యకర్తలు సంబరాలు నిర్వహించాలని రాజేశ్వర్ రెడ్డి సూచించారు.