అవన్నీ ఫేక్ న్యూస్.. ఇరాన్ అణు స్థావరాలు పూర్తిగా నాశనం చేశాం: ట్రంప్

అవన్నీ ఫేక్ న్యూస్.. ఇరాన్ అణు స్థావరాలు పూర్తిగా నాశనం చేశాం: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయడంలో అమెరికా విఫలమైందని, అమెరికా దాడి చేయడానికి ముందే ఇరాన్ యూరేనియాన్ని మరో చోటుకు తరలించినట్లు పలు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఇరాన్‌ అణు కేంద్రాలను నాశనం చేయడంలో అమెరికా విజయవంతం కాలేదన్న మీడియా నివేదికలను ఆయన తోసిపుచ్చారు. 

అవన్నీ నకిలీ వార్తలని పేర్కొన్నారు. ఇరాన్‎లో మేం టార్గెట్ చేసిన ప్రదేశాలను పూర్తిగా నాశనం చేశామన్నారు. న్యూయార్క్ టైమ్స్‌, సీఎన్ఎన్ మీడియా చానెళ్లు చేతులు కలిపి చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడులలో ఒకదానిని కించపరిచే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. అమెరికా వైమానిక దాడులపై తప్పుడు ప్రచారం చేసి ప్రజల చేత విమర్శలు ఎదుర్కొంటున్నాయన్నారు. 

అమెరికా ప్రెసిడెంట్ ఆఫీస్  వైట్ హౌస్ కూడా ఈ వార్తలను ఖండించింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వార్తలను ఫేక్ న్యూస్‎గా అభివర్ణించారు. ఆ వార్తలు అధ్యక్షుడు ట్రంప్‌ను కించపరిచే స్పష్టమైన ప్రయత్నమని.. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్మూలించడానికి ధైర్యంగా సాహసం చేసిన యుద్ధ పైలట్లను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నమని పేర్కొన్నారు.

కాగా, ఇరాన్‎లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. అమెరికా భీకర దాడుల్లో ఈ మూడు అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అయితే.. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా సైనిక దాడులు ఆ దేశ అణు కార్యక్రమం ప్రధాన భాగాలను నాశనం చేయలేదని.. ఈ దాడుల వల్ల మరికొన్ని నెలల ఆలస్యం జరిగే అవకాశం ఉందని సీఎన్ఎన్ నివేదించింది. న్యూయార్క్ టైమ్స్ కూడా ఇదే తరహా కథనం ప్రచురించింది. ఈ వార్తలపై ట్రంప్ పై విధంగా క్లారిటీ ఇచ్చారు.