- మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఎప్పుడొచ్చాయనే దానిపై ఆరా
- నిందితుడు రమేశ్తో పరిచయంపై టీఎస్పీఎస్సీ మెంబర్ లింగారెడ్డికి ప్రశ్నలు
- ఇద్దరినీ చెరో 2 గంటలు ప్రశ్నించిన అధికారులు
హైదరాబాద్, వెలుగు:టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, మెంబర్ బండి లింగారెడ్డి శనివారం సిట్ విచారణకు హాజరయ్యారు. పేపర్ లీక్ కేసులో నిందితుల వివరాలను వారు సిట్కు తెలిపారు. అనితా రామచంద్రన్ను మహిళా ఎస్ఐలు మాధవి, మేఘన ఆధ్వర్యంలో విచారించారు. నిందితుడు ప్రవీణ్కు సంబంధించి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. దాదాపు 2 గంటలపాటు (మధ్యాహ్నం 12.30 వరకు) అనితా రామచంద్రన్ నుంచి సమాచారం సేకరించారు. ఆమె సిట్ ఆఫీసు నుంచి వెళ్లిపోయిన తరువాత మధ్యాహ్నం 2 గంటలకు టీఎస్పీఎస్సీ మెంబర్ లింగారెడ్డి విచారణకు వచ్చారు. ఆయనను కూడా దాదాపు రెండు గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. గ్రూప్1, ఏఈ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో భాగంగా కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్, మెంబర్ బండి లింగారెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాన నిందితులు ప్రవీణ్, రమేశ్, షమీమ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా వీరిద్దరిని ప్రశ్నించారు.
రెగ్యులర్, ఔట్సోర్సింగ్ జాబ్స్వివరాలపై..
టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్, సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి కస్టోడియన్స్గా ఉన్న కాన్ఫిడెన్షియల్ సెక్షన్ గురించి వివరాలు సేకరించారు.9 రోజుల కస్టడీలో ప్రవీణ్ వెల్లడించిన వివరాలను సెక్రటరీతో సిట్ అధికారులు చర్చించారు. టీఎస్ పీఎస్సీ కి సంబంధించిన రెగ్యులర్,ఔట్సోర్సింగ్ జాబ్స్వివరాలను తెలుసుకున్నారు.ఆమె ఇచ్చిన సమాచారాన్ని రికార్డ్ చేశారు. సెక్రటరీ అనితా రామచంద్రన్ పీఏగా ప్రవీణ్ విధులు, కాన్ఫిడెన్సియల్ సెక్షన్కు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకున్నారు. గ్రూప్1 పేపర్ సహా అన్ని పేపర్స్కి సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ కమిషన్ వద్దకు ఎప్పుడు వచ్చాయనే వివరాలపైనా ప్రశ్నలు అడిగి సమాధానాలను రికార్డ్ చేశారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్, సెక్షన్ ఆఫీసర్ మినహా పేపర్ డేటా విషయం ఇంకా ఎవరికైనా తెలుసా అనే కోణంలో ప్రశ్నించినట్లు తెలిసింది. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు అనితా రామచంద్రన్ పూర్తి వివరాలు అందించినట్లు సమాచారం.
లీకుల గురించి రమేశ్ ప్రస్తావించిండా?
టీఎస్పీఎస్సీ మెంబర్ బండి లింగారెడ్డి నుంచి సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు సేకరించారు. టీఎస్పీఎస్సీ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేసిన మరో నిందితుడు రమేశ్తో పరిచయంపై లింగారెడ్డిని ఆరా తీశారు.రమేష్ ఎంత కాలంగా తెలుసు ? ఔట్సోర్సింగ్ కింద ఎవరు జాయిన్ చేశారు ? అనే వివరాలను అడిగినట్లు తెలిసింది.రమేశ్ తన పీఏగా ఎలాంటి విధులు నిర్వర్తించేవాడని ప్రశ్నించినట్లు సమాచారం. చైర్మన్,సెక్రటరీకి చెందిన పేషీల వివరాలను అడిగినట్లు తెలిసింది.రమేశ్ గ్రూప్1 పరీక్ష రాస్తున్న విషయం చెప్పాడా ? అనే వివరాలను కూడా సేకరించారు. ఎప్పుడైనా పేపర్ లీకేజీల గురించి ప్రస్తావించాడా ? అని ప్రశ్నించినట్లు తెలిసింది. టీఎస్పీఎస్సీలో ఔట్సోర్సింగ్ రిక్రూట్మెంట్, కమిషన్ మెంబర్స్ గురించి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.సిట్ అధికారులు లింగారెడ్డిని కూడా రెండు గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.