
టీవీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడు పూర్ణచందర్ భార్య స్వప్న ఓ వీడియో రిలీజ్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. స్వేచ్ఛ తనను కూడా మానసికంగా టార్చర్ చేసిందన్నారు. స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యం అని అన్నారు. అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడని చెప్పారు స్వప్న.
వీడియోలో స్వప్న ఏం మాట్లాడిందంటే.? స్వేచ్చ కూతురు మా ఆయన మీద వేస్తున్న నిందలు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆమెను పూర్ణచందర్ సొంత బిడ్డలా చూసుకున్నారు. స్వేచ్చ నన్ను కూడా చాలా టార్చర్ పెట్టింది. నాకు మా ఆయనకు పదే పదే కాల్స్ చేసి సతాయించేది. స్వేచ్చ కూతురికి అలా చెప్పమని ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు. పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ తెలుసు. వారిద్దరి మధ్య సంబంధం నాకు తెలియదు. వారిద్దరి వ్యవహారం తెలిశాక పూర్ణను వదిలేశాను. స్వేచ్ఛ పూర్ణచందర్ను బ్లాక్మెయిల్ చేసింది. నా పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని స్వేచ్ఛ బయపెట్టింది. నా భర్త నిర్దోషి, అమాయకుడు.మా ఆయన అంత చెడ్డోడు కాదు. న్యాయస్థానాలపై నాకు నమ్మకం ఉంది అని తెలిపారు.
నిందితుడు పూర్ణచందర్పై జూన్ 29న పోక్సో కేసు నమోదైంది. స్వేచ్ఛ కూతురు ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. జూన్ 27న స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి పరారీలో ఉన్న పూర్ణచందర్ ను శనివారం అర్ధరాత్రి పోలీసుల ముందు లొంగిపోయాడు. అంతకుముందే.. స్వేచ్ఛ మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఓ లేఖను విడుదల చేశాడు.
ఈ క్రమంలో స్వేచ్ఛ కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్ణచందర్ లేఖలో రాసినవన్నీ అబద్ధాలేనని, తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, అమ్మతో ఎప్పుడూ కలవనిచ్చేవాడు కాదని అందులో పేర్కొంది. పెండ్లి పేరిట తన తల్లి స్వేచ్ఛను నమ్మించి మోసం చేశాడని, ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని తెలిపింది. పూర్ణచందర్ ను అరెస్టు చేసినట్లు చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్ తెలిపారు. ప్రతిసారి పెండ్లి మాట దాటవేయడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. పూర్ణచందర్పై బీఎన్ఎస్ యాక్ట్ 69,108తో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నాంపల్లిలో జడ్జి ముందు ప్రవేశపెట్టగా.. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.