V6 News

“భర్త, పిల్లలు వద్దు”.. పోలీస్ స్టేషన్లో తాళి తీసి టేబుల్‌పై పెట్టి వెళ్లిపోయిన భార్య.. భర్త కూడా వెళ్లిపోయాడు !

“భర్త, పిల్లలు వద్దు”.. పోలీస్ స్టేషన్లో తాళి తీసి టేబుల్‌పై పెట్టి వెళ్లిపోయిన భార్య.. భర్త కూడా వెళ్లిపోయాడు !

కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం అలుగునూర్ తమిళ కాలనీలో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది. సయోధ్య కోసం పోలీసులు కౌన్సిలింగ్ ప్రయత్నం చేశారు. కానీ.. భార్యాభర్త పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చాక కూడా మారలేదు. 

“భర్త, పిల్లలు వద్దు” అంటూ తాళి తీసి టేబుల్‌పై పెట్టి, ఇద్దరు చిన్నారులను స్టేషన్‌లో వదిలి భార్య వెళ్లిపోయింది. కన్న బిడ్డలను ఇద్దరినీ పోలీస్ స్టేషన్లో వదిలి భార్యాభర్త ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. రవికుమార్–లలిత దంపతులు పదేళ్లుగా దాంపత్య బంధంలో ఉన్నారు.

ఇద్దరు కూతుళ్లు ఉన్నప్పటికీ వేరు వేరుగా ఉంటున్నారు. నిజామాబాద్‌లో లలిత, అలుగునూర్‌లో రవికుమార్ నివాసం ఉంటున్నారు. పోలీసులు ఆపినా వినకుండా లలిత వినకుండా వెళ్లిపోయింది. కొద్ది సేపటికే పిల్లలను రవికుమార్ కూడా వదిలి వెళ్లిపోయాడు. తల్లిదండ్రుల తీరుతో పోలీస్ స్టేషన్‌లోనే ఇద్దరు చిన్నారులు బిక్కుబిక్కుమంటూ కనిపించిన దృశ్యం చూసి ఖాకీల మనసు కరిగిపోయింది. 

“అమ్మ కావాలి” అంటూ ఇద్దరు పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఏడ్చారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల నానమ్మ వివరాలు సేకరించి  పిల్లలను పోలీసులు నానమ్మకు అప్పగించారు. కన్న బిడ్డలను కూడా కాదనుకునేంత కర్కశత్వంతో తల్లిదండ్రులు ప్రవర్తించడంపై ఈ విషయం తెలిసిన ఇరు గ్రామాల ప్రజలు మండిపడ్డారు.