నిర్లక్ష్యానికి శిక్ష.. ఆరుగురు టీచర్ల సస్పెన్షన్.. సిద్దిపేటలో ఒకే స్కూల్ఉపాధ్యాయులపై వేటు

 నిర్లక్ష్యానికి శిక్ష.. ఆరుగురు టీచర్ల సస్పెన్షన్.. సిద్దిపేటలో ఒకే స్కూల్ఉపాధ్యాయులపై వేటు

సిద్దిపేట, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యంతో పాటు సమయపాలన పాటించని సిద్దిపేట మల్టిపర్పస్  బాయ్స్  హైస్కూల్ కు చెందిన ఆరుగురు టీచర్లపై సస్పెన్షన్​ వేటు చేస్తూ మంగళవారం  కలెక్టర్  కె.హైమవతి ఉత్తర్వులు జారీ చేశారు. 

గత నెల 28న సిద్దిపేట మల్టిపర్పస్  బాయ్స్  హైస్కూల్ ను  కలెక్టర్  హైమవతి సందర్శించారు. ఆ సమయంలో రిజిస్టర్​లో సంతకం చేసిన టీచర్లు స్కూల్​లో లేకపోవడం, వార్షిక ప్రణాళికలు, డైరీలు రాయకపోవడం, ఫేషియల్  రికగ్నైజేషన్  లో 50 శాతం వరకు విద్యార్థుల హాజరు నమోదు లేకపోవడం వంటి  అంశాలు గుర్తించారు. స్కూల్​ నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్నారని తేల్చారు.

 ఈ విషయంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి పూర్తి నివేదిక అందజేయాలని డీఈవోను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా స్కూల్​ అసిస్టెంట్​లు జి బాలముకుంద శర్మ, అక్బర్ ఉన్నీసా, నికత్ సుల్తానా, రాజేందర్, నాగరాణి, సుభద్ర రాణిని సస్పెండ్  చేశారు. 

హెచ్ఎం శ్రీదేవి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్​ నోటీస్  జారీ చేశారు. ఫేషియల్  రికగ్నైజేషన్  విషయంలో నిర్లక్ష్యం వహించిన సీఆర్పీలు క్రాంతి కుమార్, సవిత పనితీరుపై విచారణ జరిపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే టీచర్లపై చర్యలు తప్పవని కలెక్టర్  హెచ్చరించారు.