మానేరు వాగులో పల్సర్ బైక్ తో పాటు కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు..తాడు సాయంతో రక్షించిన స్థానికులు

మానేరు వాగులో పల్సర్ బైక్ తో పాటు   కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు..తాడు సాయంతో రక్షించిన స్థానికులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.  ఎల్లారెడ్డిపేట మండలం పదిర - రామలక్ష్మణపల్లె మధ్య ఉన్న మానేరు వాగు కాజ్‌వేపై భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది.అయినప్పటికీ లెక్కచేయకుండా పల్సర్ బైక్‌పై ఆ కాజ్‌వే దాటేందుకు ప్రయత్నించారు ఇద్దరు యువకులు. అయితే... ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో బైక్‌తో సహా ఇద్దరు యువకులు వాగులోకి కొట్టుకుపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారు సహాయం కోసం కేకలు వేశారు.

అదే సమయంలో అక్కడే ఉన్న పదిర గ్రామ యువకులు ఏమాత్రం వెనుకాడలేదు. అప్రమత్తమై వెంటనే ప్రాణాలకు తెగించి... తాడు సహాయంతో సాహసోపేతంగా ఆ ఇద్దరు యువకులను ప్రాణాలతో కాపాడారు.

సకాలంలో స్పందించి ప్రాణాలను కాపాడిన ఆ సాహస యువకులను గ్రామస్తులంతా అభినందించారు. అయితే వరద సమయంలో ఇలాంటి సాహసాలు చేయవద్దని, కాజ్‌వేలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.