- మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కొద్ది గంటల్లోనే విడుదల
- డీఎంకే కార్యకర్తల నిరసన.. తమిళనాడులో ఉద్రిక్తత
- ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యేనని డీఎంకే ఫైర్
- ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం: ఎం.కె. స్టాలిన్
- అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేందుకే అరెస్ట్ అని కామెంట్
చెన్నై: ప్రముఖ సినీ నటి త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న తీవ్ర ఆరోపణలపై తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన ఇంటికెళ్లిన పోలీసులు.. నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. అయితే, విచారణ ముగిసిన వెంటనే ఉదయనిధిని విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దీంతో, పోలీసులు ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసి రిలీజ్ చేశారు. ఉదయనిధి అరెస్ట్ సందర్భంగా పెద్ద సంఖ్యలో డీఎంకే కార్యకర్తలు, నాయకులు తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల డీఎంకే శ్రేణులు ధర్నాలు, రోడ్ల దిగ్బంధం చేపట్టాయి.
ఉదయనిధి ఇంటివద్ద ఉత్కంఠ వాతావరణం
మంగళవారం ఉదయం చెన్నై నీలాంగరైలోని ఉదయనిధి నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఈ సమయంలో ఉదయనిధి భార్య కిరుత్తిగ స్టాలిన్, మాజీ మంత్రి మా. సుబ్రమణ్యన్ పోలీసులతో మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకొని తంజావూరు తరలించారు. ఈ అరెస్ట్ను సవాలు చేస్తూ డీఎంకే న్యాయవాదులు వెంటనే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ వాదనలు వినిపిస్తూ.. ఉదయనిధిని రిమాండ్కు తరలించే ఉద్దేశం పోలీసులకు లేదని, కేవలం విచారణ జరిపి స్టేషన్ బెయిల్ పై విడుదల చేస్తామని తెలిపారు. విచారణకు సహకరించాలని సూచిస్తూ ఉదయ నిధి
విడుదలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగింది?
కావేరీ జలాల వివాదంపై ఈ నెల 3న తంజావూరులో డీఎంకే నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇందులో ఉదయనిధి ప్రసంగిస్తుండగా, సభలోని కొందరు వ్యక్తులు ‘త్రిష.. త్రిష’ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని దుమారం రేగింది. దీనిపై టీవీకే పార్టీ మహిళా విభాగం తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అలాగే జాతీయ మహిళా కమిషన్కు కూడా టీవీకే లీగల్ సెల్ కంప్లైంట్ సమర్పించింది. మహిళలను అవమానించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, వీడియోను వైరల్ చేయడంలాంటి తీవ్రమైన అంశాలపై బీఎన్ఎస్ చట్టంతోపాటు తమిళనాడు మహిళా వేధింపుల నిరోధక చట్టం కింద పోలీసులు ఉదయ నిధిపై 9 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ అరెస్ట్ను రాజకీయ కక్షసాధింపు చర్యగా డీఎంకే మండిపడింది. కావేరీ సమస్యను పక్కదారి పట్టించేందుకే ఈ రచ్చ చేస్తున్నారని విమర్శించింది.
