
కొందరికి చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు. వారంలో ప్రతిరోజు పెట్టిన చికెన్ తింటుంటారు. చికెన్తో తయారు చేసే వివిధ వైరెటీలను లాగించేస్తుంటారు. చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్, చికోన్ పకోడి ఇలా.. చికెన్తో తయారు చేసే వంటకాలను ఇష్టంగా తింటుంటారు. ఇలా చికెన్ అంటే పడి చచ్చేవారికి తినే వారికి నిజంగానే ఇది గుండె ఆగిపోయేలాంటి వార్త .
ఎందుకంటే చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్ముతున్నారు కొందరు. రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు చికెన్కు బదులుగా గబ్చిలాల మాంసాన్ని పంపుతున్నారు. గబ్బిలాల మాంసంతోనే బిర్యానీ, పకోడి, చిల్లీ చికెన్ వంటి వంటకాలు చేసి కస్టమర్లకు అమ్ముతున్నారు. చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్ముతోన్న షాకింగ్ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. గబ్బిలాలను వేటాడి చికెన్ అని చెప్పి అమ్ముతోన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. తమిళనాడులోని సేలం జిల్లా ఓమలూరులోని డానిష్పేటై సమీపంలో చికెన్ అని చెప్పి గబ్బిలం మాంసం విక్రయిస్తోన్న ఇద్దరు వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. తోప్పూర్ రామసామి అటవీ ప్రాంతంలో తుపాకీ కాల్పులు వినిపించడంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ రేంజర్ విమల్ కుమార్ నేతృత్వంలో అధికారులు అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో నాటు తుపాకులతో గబ్బిలాలను వేటాడుతోన్నకమల్, సెల్వం అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.
అధికారుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులిద్దరూ చికెన్ పేరుతో గబ్బిలాల మాంసాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానిక రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు గబ్బిలాల మాంసాన్ని అమ్ముతుండగా.. దానితోనే చికెన్ బిర్యానీ, చికెన్ పకోడి, చిల్లీచికెన్ లాంటి వంటకాలను తయారు చేసి కస్టమర్లకు అమ్ముతున్నట్లు గుర్తించారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం విక్రయిస్తున్నారన్న వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం తెలిసి ప్రజలకు ఆందోళనకు గురయ్యారు. ఇన్ని రోజులు మనం లొట్టలేసుకుంటూ తిన్నది గబ్బిలం మాంసం అని తెలియడంతో ఏం అవుతుందోనని భయంతో వణికిపోతున్నారు.