మూసీ ఒడ్డున మినీ శిల్పారామం రెడీ

మూసీ ఒడ్డున మినీ శిల్పారామం రెడీ

హైదరాబాద్‌‌, వెలుగు:భాగ్యనగర ప్రజలకు పల్లె అనుభూతి పంచేందుకు సిటీలో మరొక శిల్పారామం సిద్ధమయ్యింది. నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయి. ఉప్పల్ భగాయత్ లే అవుట్ పక్కన మూసీ నది ఒడ్డున రూ.10 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ 2018లో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది. ఇందుకోసం ఏడున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. మాదాపూర్​లోని శిల్పారామానికి పనిచేసిన కాంట్రాక్టర్లే ఇక్కడి పనులు చేపడుతున్నారు.

మొత్తం30 మంది కార్మికులు ఉప్పల్​లోని మినీ శిల్పారామానికి మెరుగులు దిద్దారు. మొదట దసరాకు, ఆ తర్వాత సంక్రాంతి నాటికైనా సందర్శకులకు అందుబాటులోకి తేవాలని భావించారు. పనుల జాప్యంతో అనుకున్న సమయానికి ప్రారంభించలేకపోయారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.10 కోట్లు నిర్ణయించగా ఇప్పటి వరకు రూ.3కోట్లు మాత్రమే విడుదలయ్యాని తెలిసింది. దీంతోనే ఓపెనింగ్ ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(జూన్–2) నాడు ప్రారంభం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.ఈసారైనా ఓపెన్ ​చేస్తారో లేదో చూడాలి.

సేమ్​టూ సేమ్​

హస్త కళలు, చేనేత వస్త్రాలకు నిలయం మాదాపూర్​లోని శిల్పారామం. ఉప్పల్ భగాయత్ లే అవుట్ పక్కన రెడీ అయిన ఈ మినీ శిల్పారామంలోనూ హస్తకళలు, చేనేత వస్త్రాల కోసం 50 స్టాళ్లను నిర్మించారు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు సేదతీరడానికి మైదానాన్ని సిద్ధం చేశారు. గ్రీనరీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే శిల్పారామం ఆర్చీ పూర్తయ్యింది. దీనికి ఎదురుగా పౌంటేన్‌‌ను నిర్మించారు.  విభిన్న రుచులతో ఫుడ్ కోర్టు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు పెద్ద స్టేజ్(యాంపీ థియేటర్)ని సిద్ధం చేశారు. వెదురు బొంగులతో స్టాళ్లు నిర్మించారు. ఇప్పటికే రకరకాల మొక్కలు నాటారు. మూసీనది ఒడ్డున ఎప్పటికే పెంచిన మొక్కలు  సువాసను వెదజల్లుతుండటంతో పరిసరాలు ఆహ్లారభరితంగా మారాయి. సందర్శకులు మంచిగా ఎంజాయ్​చేస్తారని నిర్వాహకులు
చెబుతున్నారు.