కేదార్‎నాథ్ యాత్ర మార్గంలో గొడవ: యాత్రికులపై కర్రలతో విచక్షణరహితంగా పార్కింగ్ సిబ్బంది దాడి

కేదార్‎నాథ్ యాత్ర మార్గంలో గొడవ: యాత్రికులపై కర్రలతో విచక్షణరహితంగా పార్కింగ్ సిబ్బంది దాడి

డెహ్రాడూన్: పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారడంతో పర్యాటకులను చితకొట్టారు పార్కింగ్ సిబ్బంది. ఈ ఘటన కేదార్‎నాథ్ యాత్ర మార్గంలో చోటు చేసుకుంది. యాత్రికులపై పార్కింగ్ సిబ్బంది విచక్షణరహితంగా కర్రలతో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం (జూన్ 19) కేదార్‌నాథ్ యాత్ర మార్గంలోని సీతాపూర్ పార్కింగ్ ప్రదేశంలో కొందరు యాత్రికులు, పార్కింగ్ సిబ్బంది మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదం కాస్తా భౌతిక ఘర్షణలకు దారి తీసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన పార్కింగ్ సిబ్బంది యాత్రికులపై కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దారుణాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారడంతో పార్కింగ్ సిబ్బందిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. 

చిన్న వివాదానికే అలా కర్రలతో చితకబాదటం ఏంటని.. నిందితులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెంటనే సోన్‌ప్రయాగ్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన సీతాపూర్ పార్కింగ్ ప్రాంతంలో జరిగిందని నిర్ధారించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని యాత్రికులపై దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను స్థానిక పార్కింగ్ సిబ్బందిగా గుర్తించారు. వీరితో పాటు  పార్కింగ్ కాంట్రాక్ట్ ఓనర్‎ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. యాత్రికులపై దాడికి పాల్పడ్డ నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నట్లు పోలీసులు తెలిపారు.