- గతంలో మన ప్లేస్ 47
- ఐటీయూ రిపోర్టు
వెలుగు బిజినెస్ డెస్క్: గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020 లో మన దేశం 10 వ ప్లేస్లో నిలిచింది. అంతకు ముందు కంటే 37 ప్లేస్లు ఇండియా ముందుకొచ్చినట్లు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) రిపోర్టు వెల్లడించింది. గతంలో 47 వ ప్లేస్లో ఉన్న ఇండియా 2020 జీసీఐ ర్యాంకింగ్స్లో 10 వ ప్లేస్కి ఎదిగిందని పేర్కొంది. ఈ ర్యాంకింగ్స్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) మొదటి ప్లేస్లో నిలవగా, యూకే, సౌదీ అరేబియాలు రెండో ప్లేస్లో నిలిచాయి. ఆ తర్వాత ఎస్టోనియా మూడో ప్లేస్లోను, కొరియా, సింగపూర్, స్పెయిన్లు (మూడు దేశాలూ) నాలుగో ప్లేస్లో నిలిచాయి. రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మలేషియా దేశాలు అయిదో ప్లేస్ను పంచుకున్నాయి. లిథుయేనియా ఆరో ప్లేస్, జపాన్ ఏడో ప్లేస్, కెనడా ఎనిమిది, ఫ్రాన్స్ తొమ్మిదో ప్లేస్లోనూ నిలిచినట్లు ఐటీయూ ఈ రిపోర్టులో తెలిపింది. ఏషియా–పసిఫిక్ ప్రాంతానికి చూస్తే, 97.49 స్కోర్తో నాలుగో ర్యాంక్ను మన దేశం సాధించింది. కొరియా, సింగపూర్లు మొదటి ప్లేస్ను పంచుకోగా, మలేషియా రెండో ప్లేస్లోనూ, జపాన్ మూడో ప్లేస్లోనూ నిలిచాయి. ఐటీయూలో మొత్తం 194 దేశాలకు మెంబర్షిప్ ఉంది. అయిదు అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఇండెక్స్ను రూపొందిస్తున్నారు. ఆన్లైన్ సర్వేతోపాటు, సపోర్టింగ్ ఎవిడెన్స్లను సేకరించడం, ఎక్స్పర్ట్లను కూడా ఐటీయూ కన్సల్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఓవరాల్ జీసీఐ స్కోర్ను ప్రకటిస్తుంది. తాజాగా ప్రకటించిన రిపోర్టు ఐటీయూ నాలుగో ఎడిషన్.
లింక్డ్ఇన్ డేటా లీక్ ?
70 కోట్ల మంది లింక్డ్ఇన్ యూజర్ల డేటా లీకయ్యింది. ఈ డేటాను ఒక హ్యాకర్ ఆన్లైన్లో అమ్మకానికి పెట్టడంతో ఇది బయటకు వచ్చింది. ఈ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్కు మొత్తం 75.6 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అంటే, సుమారు 92 శాతం మంది యూజర్ల డేటా బయటకు లీకయినట్లు. లింక్డ్ఇన్ యూజర్ల పర్సనల్ డిటెయిల్స్, ఫోన్ నెంబర్లు, అడ్రస్లు, జియోలొకేషన్ డేటా, వారికొచ్చే జీతాల వివరాలు వంటివన్నీ లీకయిన డేటాలో ఉన్నట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. హ్యాకర్ ఫోరమ్ ఒక దానిలో ఆ హ్యాకర్ 10 లక్షల మంది యూజర్ల డేటాను శాంపిల్గా ఉంచినట్లు ప్రైవసీ షార్క్స్ రిపోర్టు చేసింది. అయితే, తమ మెంబర్ల డేటా లీక్ కాలేదని మరోవైపు లింక్డ్ఇన్ చెబుతోంది. లింక్డ్ఇన్ సహా మరికొన్ని వెబ్సైట్ల నుంచి తీసుకొచ్చిన డేటాగా కొట్టిపారేసింది. ఏప్రిల్ 2021లో ఏ డేటా లీక్ గురించి మాట్లాడామో ఇప్పుడూ అదే డేటా లీకయిందంటున్నారని లింక్డ్ఇన్ స్పష్టం చేసింది. తమ మెంబర్లందరికీ తమ కంపెనీపై నమ్మకం ఉందని, స్ర్కేపింగ్ లాంటి చర్యలు లింక్డ్ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ను వయొలేట్ చేయడమే అవుతుందని తెలిపింది. అలాంటి వారిని వదిలిపెట్టబోమని పేర్కొంది.