
ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ ఓటమిపై ఆ జట్టు కో ఫౌండర్ ప్రీతి జింటా రియాక్ట్ అయ్యింది. ఈ మేరకు శుక్రవారం (జూన్ 6) ఇన్స్ స్టా గ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. ఇప్పటికి పని సగం పూర్తయింది. మిగిలిన పని పూర్తి చేయడానికి నెక్ట్స్ సీజన్లో బలంగా తిరిగి వస్తామని అభిమానులకు హామీ ఇచ్చింది ప్రీతి. మేము కోరుకున్న విధంగా ఈ సీజన్ ముగియలేదు కానీ టోర్నీలో ఈ ఏడాది ప్రయాణం స్ఫూర్తిదాయకంగా అద్భుతంగా ఉందని పేర్కొంది. మా యువ జట్టు పోరాటం, పట్టుదల నాకు చాలా నచ్చిందని ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించింది.
మా సింహాలు టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా రాణించారని కొనియాడింది. మా సర్పంచ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపించిన విధానం అద్భుతమని ప్రశంసించింది. ఈ సీజన్ ఎంతో ప్రత్యేకమైనదని.. ఎందుకంటే గాయం, జాతీయ విధి కారణంగా స్టార్ ఆటగాళ్లను కోల్పోయినప్పటికీ మేము రికార్డులను బద్దలు కొట్టామని పేర్కొంది. టోర్నమెంట్లో బ్రేక్ రావడం, హోం గ్రౌండ్ మ్యాచులు ఇతర వేదికలకు తరలించడం కాస్త ఇబ్బందిగా మారిందని తెలిపారు. దశాబ్దం తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచామని.. అలాగే ఫైనల్ మ్యాచులో చివరి వరకు పోరాడామని గుర్తు చేసింది.
టోర్నీ మొత్తం పంజాబ్ కింగ్స్ జట్టులో ప్రతి ఒక్కరు ఇంత గొప్ప ప్రతిభను కనబరిచినందుకు నేను చాలా గర్వపడుతున్నానని అన్నారు. మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, సపోర్ట్ స్టాఫ్, PBKSలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా పంజాబ్ జట్టును ఆదరించిన అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. జట్టు కష్టాల్లోనూ మాతో పాటు నిలిచారని.. టోర్నీలో జట్టు ఇంత దూరం చేరుకుందంటే దానికి కారణం మీరేనంది. ఇప్పటికి పని సగం పూర్తయింది. మిగిలిన సగం పనిని పూర్తి చేయడానికి నెక్ట్స్ సీజన్లో బలంగా తిరిగి వస్తామని హామీ ఇస్తున్నానని పేర్కొంది.
వచ్చే ఏడాది స్టేడియంలో కలుద్దామని.. అప్పటి వరకు జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండని అభిమానులకు సూచించింది. కాగా, 2025, జూన్ 3న నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో పంజాబ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ తుదిపోరులో పంజాబ్ ను చిత్తు చేసి ఆర్సీబీ 2025 విజేతగా నిలిచింది. తద్వారా తొలిసారి ఐపీఎల్ టైటిల్ ను ఆర్సీబీ కైవసం చేసుకుంది. దీంతో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గాలన్న పంజాబ్కు వరుసగా 18వ సారి కూడా నిరాశే ఎదురైంది.