
శ్రీనగర్: సింధూ నదీ వ్యవస్థలోని పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ల నీటిని తామెందుకు పంజాబ్, హర్యానా, రాజస్థాన్లకు ఇవ్వాలని కేంద్రాన్ని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. సింధూ నదీ నీటిని మళ్లించే 113 కిలోమీటర్ల కాలువ ప్రతిపాదనకు తాము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోబోమని స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
"పంజాబ్కు మేం ఎందుకు నీళ్లు పంపాలి? మాకు అవసరమైనప్పుడు వారు ఇచ్చారా? అయినా, ఒప్పందం ప్రకారం.. పంజాబ్కు అల్రెడీ నీరు వెళ్తున్నాయి కదా! పఠాన్కోట్లోని షాపూర్ కండి బ్యారేజీ విషయంలో పంజాబ్ మమ్మల్ని 45 ఏండ్లు ఇబ్బంది పెట్టింది. అవన్నీ మాకింకా గుర్తున్నాయి. అందుకే నేను 113 కిలోమీటర్ల కాలువ ప్రతిపాదనను ఎప్పటికీ అనుమతించను" అని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ నీటిని పంజాబ్, రాజస్థాన్, హర్యానాలకు మళ్లించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే 113 కిలోమీటర్ల కాలువ ప్రతిపాదనను తీసుకొచ్చింది.