రసెల్‌‌ దంచెన్‌‌..ఆఖరి టీ20లో విండీస్‌‌ గెలుపు

రసెల్‌‌ దంచెన్‌‌..ఆఖరి టీ20లో విండీస్‌‌ గెలుపు

పెర్త్‌‌: బ్యాటింగ్‌‌లో ఆండ్రీ రసెల్‌‌ (29 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 7 సిక్స్‌‌లతో 71), షెర్ఫానె రూథర్‌‌ఫోర్డ్‌‌ (40 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 5 సిక్స్‌‌లతో 67 నాటౌట్‌‌) దంచికొట్టడంతో.. మంగళవారం జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో వెస్టిండీస్‌‌ 37 రన్స్‌‌ తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గింది. తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన కంగారూ టీమ్  2–1తో సిరీస్ నెగ్గగా.. విండీస్ ఊరట దక్కించుకుంది.  

టాస్‌‌ గెలిచిన విండీస్‌‌ 20 ఓవర్లలో 220/6 స్కోరు చేసింది. జాన్సన్‌‌ చార్లెస్‌‌ (4), కైల్‌‌ మేయర్స్‌‌ (11), పూరన్‌‌ (1) ఫెయిల్‌‌కావడంతో 17 రన్స్‌‌కే 3 వికెట్లు కోల్పోయింది. రోస్టన్‌‌ ఛేజ్‌‌ (37),  పావెల్‌‌ (21) వరుస విరామాల్లో ఔట్‌‌కావడంతో విండీస్‌‌ 79/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో రసెల్‌‌, రూథర్‌‌ఫోర్డ్‌‌ ఆరో వికెట్‌‌కు 67 బాల్స్‌‌లోనే 139 రన్స్‌‌ జత చేసి భారీ టార్గెట్‌‌ను నిర్దేశించారు.

బార్ట్‌‌లెట్‌‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్‌‌ 20 ఓవర్లలో 183/5 స్కోరుకే పరిమితమైంది. డేవిడ్‌‌ వార్నర్‌‌ (81) ఒంటరి పోరాటం చేశాడు. మార్ష్‌‌ (17)తో తొలి వికెట్‌‌కు 68, ఆరోన్‌‌ హార్డీ (16)తో రెండో వికెట్‌‌కు 46 రన్స్‌‌ జత చేశాడు. చివర్లో టిమ్‌‌ డేవిడ్‌‌ (41 నాటౌట్‌‌) చెలరేగినా విజయాన్ని అందించలేకపోయాడు. షెపర్డ్‌‌, ఛేజ్‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. రసెల్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’, వార్నర్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌’ అవార్డులు లభించాయి.