25న యాదాద్రికి సీఎం రాక

25న యాదాద్రికి సీఎం రాక

శివాలయ ఉద్ఘాటన, స్పటికలింగం ప్రతిష్ఠాపనలో పాల్గొననున్న కేసీఆర్​ దంపతులు 
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రారంభం కోసం ఈ నెల 20 నుంచి 25 వరకు మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 25న శివాలయం ఉద్ఘాటన, రామలింగేశ్వరస్వామి స్పటికలింగం  ప్రతిష్ఠాపనలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటారని చెప్పారు.

కొండపైన శివాలయంలో చేస్తున్న ఏర్పాట్ల గురించి ఈఓ సోమవారం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ 21 నుంచి 25వ తేదీ వరకు పాంచాహ్నిక దీక్షతో 'పంచకుండాత్మక రుద్ర యాగం' నిర్వహించనున్నట్లు తెలిపారు. 25న ఉదయం 10:25 గంటలకు తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్పటిక లింగ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ చేసి శివాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. ఈ పూజల్లో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటారన్నారు. కాగా, కవరేజీకి మీడియాకు అనుమతి లేదని ఈఓ స్పష్టం చేశారు. తామే లైవ్ కవరేజీ సదుపాయం కల్పిస్తామన్నారు. విజువల్స్, ఫొటోలు, పూజల వివరాలు ఎప్పటికప్పుడు అందివ్వడానికి ఏఈవో స్థాయి ఆఫీసర్ ను నియమించామన్నారు.