యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆన్లైన్ సేవలు బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు మిల్లెట్స్ లడ్డూల విక్రయం, బంగారు, వెండి కాయిన్స్ అమ్మకాన్ని విప్ గొంగిడి సునీతతో కలిసి ఎండోమెంట్ మినిస్టర్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ప్రధానాలయ ముఖ మంటపంలో లక్ష్మీనరసింహుల ప్రతిమ కలిగిన బంగారు, వెండి కాయిన్స్, మిల్లెట్స్ లడ్డూలను విక్రయించారు. 80 గ్రాములుండే ఒక్కో లడ్డూ ధరను రూ.40గా నిర్ణయించారు. 3 గ్రాముల బంగారు కాయిన్ను ఈవో గీతారెడ్డి రూ.21 వేలు చెల్లించి కొనగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి రూ.వెయ్యి చెల్లించి 5 గ్రాముల వెండి కాయిన్ కొన్నారు.
తర్వాత కొండపై ఉన్న వీఐపీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్ సెటప్ ద్వారా ఆలయ వెబ్సైట్ఓపెన్ చేసి ఆన్లైన్ టికెటింగ్ సిస్టం ప్రారంభించారు. http://yadadritemple.Telangana.gov.in వెబ్సైట్ద్వారా అన్ని రకాల టికెట్లు, సేవలు, గదులను బుక్ చేసుకోవచ్చని ఆఫీసర్లు తెలిపారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ఎలిమినేటి సందీప్ రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, జడ్పీటీసీ అనురాధ, మున్సిపల్ చైర్ పర్సన్ సుధ పాల్గొన్నారు.