
టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన చెత్త ఫీల్డింగ్ తో టీమిండియా విజయానికి అడ్డుపడుతున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న లీడ్స్ టెస్టులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు క్యాచ్ లు మిస్ చేసి విమర్శల పాలవుతున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో మూడు క్యాచ్ లు జారవిడిచి ఈ టీమిండియా ఓపెనర్.. రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన డకెట్ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. డకెట్ 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జైశ్వాల్ క్యాచ్ మిస్ చేశాడు.
అసలే భారత్ వికెట్ల కోసం ఇబ్బంది పడుతుంటే జైశ్వాల్ పదే పదే క్యాచ్ లు వదిలేయడం ఆగ్రహానికి గురి చేస్తుంది. సిరాజ్ వేసిన షార్ట్ బంతిని డకెట్ పుల్ షాట్ ఆడాడు. టైమింగ్ సరిగా కుదరకపోవడంతో బాల్ అక్కడే లేచింది. మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేస్తున్న జైశ్వాల్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 97 పరుగుల వద్ద బతికిపోయిన ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ సెంచరీతో ఇంగ్లాండ్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళ్తుంది. క్రీజ్ లో డకెట్ (137), రూట్ (10) క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ గెలవాలంటే మరో 132 పరుగులు చేయాలి. మరోవైపు భారత్ విజయానికి 8 వికెట్లు కావాలి. క్రాలీ హాఫ్ సెంచరీ చేసి ఔట్ కాగా పోప్ 4 పరుగులకే ఔటయ్యాడు. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణకు రెండు వికెట్లు దక్కాయి.