ఏటా 50 లక్షల టన్నుల ఉత్పత్తి పెంపు
కొత్త గనులపై సమీక్షలో సీఎండీ ఎన్.శ్రీధర్
హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో రానున్న మూడేండ్లలో 10 కొత్త ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ డైరెక్టర్లు, జీఎంలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఉత్పత్తి ప్రారంభించనున్న జీడీకే-5 ఓపెన్ కాస్టు, జేవీఆర్ ఓసీ-2 ఎక్స్టెన్షన్, నైనీ ప్రాజెక్టుల ఉత్పత్తి లక్ష్యాలతో పాటు రానున్న మూడేళ్లలో ప్రారంభించనున్న కొత్త ప్రాజెక్టులపై రివ్యూ చేశారు. 2021–22 లో ప్రారంభించనున్న జీడీకే కోల్ మైన్ నుంచి ఏడాదికి 30 లక్షల టన్నులు బొగ్గు, ఒడిశా నైనీ బొగ్గు బ్లాక్ నుంచి 100 లక్షల టన్నులు, వీకే కోల్ మైన్ నుంచి 53 లక్షల టన్నులు, ఆర్జీ కోల్ మైన్(జీడీకే-10) నుంచి 60 లక్షల టన్నులను వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలుగా ప్రతిపాదించినట్లు సీఎండీ తెలిపారు. 2021–22లో సింగరేణి సంస్థ 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తుందని పేర్కొన్నారు. 2022–23లో ప్రారంభించాల్సిన ఎంవీకే ఓసీ (25 లక్షల టన్నులు), గోలేటి ఓసీ (35 లక్షల టన్నులు), జేకే ఓసీ (రోంపేడు, 25 లక్షల టన్నులు), తాడిచర్ల ఓసీ-2 (50 లక్షల టన్నులు), పెనగడప ఓసీ (15 లక్షల టన్నులు), న్యూ పాత్రపాద (ఒడిశా) గనుల ప్రతిపాదనలు, అనుమతులకు సంబంధించిన విషయాలపై అధికారులతో చర్చించారు. 2023–24 నాటికి 850 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తుందని శ్రీధర్ పేర్కొన్నారు. పాత గనులు మూత పడుతున్నందున ఏటా 50 లక్షల టన్నులు ఉత్పత్తిని పెంచుకుంటూ పోవాలన్నారు. కొత్త గనులు ప్రారంభించడం అత్యవసరం అని, అనుమతులకు ఇప్పటి నుంచే శ్రమించాలన్నారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, ఎన్.బలరామ్, డి.సత్యనారాయణ రావుతో పాటు తో పాటు అడ్వైజర్లు ప్రసాద్, సురేంద్రపాండే, ఈడీ ఆల్విన్, ప్రాజెక్టు ప్లానింగ్, ఎస్టేట్స్, మార్కెటింగ్ తదితర శాఖల జీఎంలు పాల్గొన్నారు