40 మంది రెబల్స్ శవాలతో సమానం

40 మంది రెబల్స్ శవాలతో సమానం

శివసేనను కాదనుకొని ఏక్ నాథ్ షిండేతో చేతులు కలిపిన 40 మంది రెబల్ ఎమ్మెల్యేలు శవాలతో సమానమని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.  ‘‘గౌహతిలో శివసేన  రెబల్ ఎమ్మెల్యేలు  ఉంటున్న రాడిసన్ బ్లూ హోటల్ ను చూస్తుంటే.. బిగ్ బాస్ హౌస్ లా కనిపిస్తోందన్నారు. అక్కడున్న ఎమ్మెల్యేలంతా తాగుతూ, తింటూ, ఆడుతూ కనిపిస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. వాళ్లలో సగం మందిని బిగ్ బాస్ హౌస్ నుంచి తొలగించే అవకాశాలు కూడా ఉంటాయన్నారు. ‘‘ఎప్పటిదాకా అక్కడ దాక్కుంటారు. మీరు ఎప్పటికైనా వెనుదిరిగి చౌరస్తాకు రావాల్సిందే’’ అని చెప్పారు. ‘‘ ఆత్మలు అంతరించిపోయిన వాళ్ల శరీరాలు ఇక్కడికి తిరిగొస్తాయి. వాటిని పోస్టుమార్టం కోసం నేరుగా మార్చురీకి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ రాచుకున్న అగ్నిజ్వాలలు ఏం చేస్తాయో వాళ్లకు బాగా తెలుసు’’ అని సంజయ్ రౌత్ ఘాటు హెచ్చరికలు చేశారు.  ‘‘ఇది శివసేన. దీనికి పితామహుడు ఒక్కరే. మీరు ఆ పితామహుడిని దొంగిలించలేరు. వాళ్లంతా కలిసి మహారాష్ట్రను మూడు ముక్కలు చేయాలని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని జరగనివ్వబోం’’ అని కామెంట్స్ చేశారు.