
- ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపాలి
- పరిపాలనలోనూ స్థానిక భాషనే ఎక్కువగా వాడాలి
- ఏ ఒక్క భాషకూ హిందీ వ్యతిరేకం కాదన్న కేంద్ర హోం మంత్రి
న్యూఢిల్లీ: గతంలో భాష పేరిట దేశాన్ని విభజించే కుట్రలు జరిగాయని, అలాంటి కుట్రలు ఎన్నటికీ విజయం సాధించలేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే పవర్ఫుల్ సాధనంగా భారతీయ భాషలను మోదీ సర్కార్ చూస్తున్నదని, వాటి రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. మెడికల్, ఇంజనీరింగ్ విద్యను స్థానిక భాషల్లోనూ బోధించేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపాలని ఆయన అన్నారు. రాష్ట్రాల పరిపాలనలోనూ లోకల్ లాంగ్వేజెస్కు ప్రాధాన్యం ఇవ్వాలని తద్వారా స్థానిక భాషకు మరింత గౌరవం దక్కుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలోని ఏ ఒక్క భాషకూ హిందీ వ్యతిరేకం కాదని, అన్ని భారతీయ భాషలకు హిందీ ఫ్రెండ్ అని అన్నారు.
ఇతర ఫారిన్ భాషలకు కూడా హిందీ వ్యతిరేకం కాదన్నారు. గురువారం సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ ల్యాంగ్వేజ్ హిందీ డిపార్ట్మెంట్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో అమిత్ షా మాట్లాడారు. ‘‘బానిస మనస్తత్వం నుంచి బయటపడటానికి సొంత భాషే మార్గం. ఒక వ్యక్తి సొంత భాషలో మాట్లాడకపోతే బానిస మనస్తత్వం నుంచి విముక్తి పొందలేడు. భాష సమాచార మాధ్యమం మాత్రమే కాదు.. అది జాతి ఆత్మను చాటుతుంది. ఏ భాషపైనా వ్యతిరేకత వద్దు. అన్నిటినీ గౌరవించాలి. పరిపాలన సొంత భాషలో జరగాలన్న లక్ష్యంతోనే అఫీషియల్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ ఏర్పడింది” అని వివరించారు.
స్థానిక భాషలకు ప్రోత్సాహం
రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల్లో లోకల్ లాంగ్వేజెస్ను ఎక్కువగా వాడాలని, ఇందుకోసం రాష్ట్రాలకు కావాల్సిన సహాయ సహకారాలను కేంద్రం అందిస్తుందని అమిత్ షా చెప్పారు. జేఈఈ, నీట్, సీయూఐటీ వంటి పరీక్షలు ఇప్పుడు 13 భాషల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ పోస్టుల రిక్రూట్మెంట్ టెస్ట్లు కూడా 13 భాషల్లో నిర్వహిస్తున్నామని, గతంలో హిందీ లేదా ఇంగ్లిష్లోనే జరిపేవారని పేర్కొన్నారు. 95 శాతం మంది అభ్యర్థులు మాతృభాషలోనే ఎగ్జామ్ రాసి విజయం సాధిస్తున్నారని తెలిపారు.
కాగా, డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని యువతకు అమిత్ షా సూచించారు. గురువారం డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. డ్రగ్స్ రహిత్ భారత్ కోసం కృషి చేస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.