వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను దాదాపు అర్ధగంట పాటు ఎటూ కదలనివ్వక ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు చుక్కలు చూపించారని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. తమ ఉద్యోగాల పేరులో మాత్రమే ఉపాధి హామీ ఉంది తప్ప.. విధులకు తమను ప్రభుత్వం దూరం పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో పనిలేక, జీతం రాక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని శాపనార్థాలు పెట్టారని తెలిపారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అని మండిపడ్డారని, పిల్లలకు సరైన తిండి కూడా పెట్టలేకపోతున్నామని మహిళా ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర వేదన వ్యక్తం చేశారన్నారు.
తన కళ్ళముందే ఇంత జరుగుతున్నా వారి సమస్యను తాను పరిశీలిస్తానని గాని.. సీఎం దృష్టికి తీసుకెళతానని గాని కనీస హామీ ఇచ్చేందుకు కూడా ఆ మంత్రి ధైర్యం చేయలేని దుస్థితి కనిపించిందని విమర్శించారు విజయశాంతి. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల కుటుంబాలు తప్ప ఒక్క వర్గం కూడా సంతృప్తిగా బతుకుతున్న దాఖలాల్లేవన్నారు. పంటల కొనుగోళ్ళు లేక రైతులు... ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఆత్మహత్యల బాటలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఎటు చూసినా ఏమున్నది గర్వకారణం అనే పరిస్థితి నెలకొందన్నారు విజయశాంతి. అధికార పార్టీని ఎప్పుడెప్పుడు గద్దె దించాలా..అని ప్రజలు ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.