మేం గెలిస్తే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం

మేం గెలిస్తే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం

రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకొస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రో ప్రకటించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారంగా జరుపుతానని ప్రకటించి మాట తప్పిన కేసీఆర్ ను గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో ఆయన పాల్గొన్నారు. చిలుకూరు నుంచి మొయినాబాద్  వరకు బండి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేశారు. 
ఈ సందర్భంగా సంబిత్ పాత్రో మాట్లాడుతూ ‘‘నీ బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సి ఉద్యోగమిచ్చినవ్. నీ కొడుకు, అల్లుడుకు మంత్రి పదవులిచ్చినవ్. మరి నిరుద్యోగులేం చేశారు? వారి కెందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు?’అని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని మండిపడ్డారు. సచివాలయానికి రాకుండా ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ లాంటి సీఎంను దేశంలో ఎక్కడా చూడలేదని విమర్శించారు.
ఒవైసీ సవాల్ మేరకు పాతబస్తీలో సభ పెట్టి సత్తా చూపాం
దమ్ముంటే పాతబస్తీలో సభ పెట్టాలని నరేంద్ర మోదీకి ఓవైసీ విసిరిన సవాల్ ను బండి సంజయ్ ఆధ్వర్యంలోని బీజేపీ కార్యకర్తలు స్వీకరించి భారీ బహిరంగ సభ పెట్టి సత్తా చూపారని, దీనికి బండి సంజయ్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది బలిదానం చేస్తే.. ఆ త్యాగాలు వృథా అయ్యాయని,  రాష్ట్రంలో ఒకే కుటుంబం పాలన చేస్తోందని ఆయన విమర్శించారు. 111 జీవో రద్దు ఏమైంది? ఎందుకు రద్దు చేయడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి ? అని ఆయన డిమాండ్ చేశారు. 
జనాన్ని మందుకు బానిసలు చేసిన ప్రభుత్వాన్ని ఓడించాల్సిందే
ఈ రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా నడుస్తోంది. 2014లో మద్యం ద్వారా రాష్ట్రానికి రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తే.....నేడు ఆ సంఖ్య ఐదారు రెట్లకు పెరిగి రూ.22 వేల కోట్లకు చేరింది. జనాన్ని మందు బానిసలుగా చేసి పాలన చేస్తున్నారు. చాలా బాధగా ఉంది. ఇలాంటి ప్రభుత్వాన్న ఓడించాల్సిందేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రో అన్నారు. ‘‘నీళ్లు-నిధులు-నియామకాలనే నినాదంతో అధికారంలోకి వచ్చి వాటిని తుంగలో తొక్కిండు..’’అని తెలుగులో నే మాట్లాడగా జనం భారీగా స్పందించారు. బీజేపీ అధికారంలోకొస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆయన స్పఫ్టం చేశారు.