కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో ఏర్పడిన వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్న బీజేపీకి మరో అంశం తలనొప్పిగా మారింది. సొంత పార్టీ నేతల ఫ్యామిలీ నుంచే పార్టీని ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఏర్పడటంతో ఇబ్బందికరంగా మారింది. నీట్ వ్యతిరేక ఆందోళనల్లో సీజేపీకి మద్ధతుగా ఇటీవలే ఎన్డీఏ నేత కూతురు నిరసనలో పాల్గొనటం మరిచిపోక ముందే.. మరో బీజేపీ నేత కూతురు సీజేపీని సపోర్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ కూతురు యశస్వినీ రాజే సింగ్ సీజేపీ కి మద్ధతు ఇస్తున్నట్లు చేసిన వీడియో వైరల్ గా మారింది. ఢిల్లీ జంతర్ మంతర్ లో సీజేపీ ప్రొటెస్టులో పాల్గొన్న యశస్వినీ.. అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషీని నియమించడం పెద్ద జోక్ అంటూ అభివర్ణించారు.
ఇంటర్వ్యూ సందర్భంగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్ విషయంలో రాజీనామా చేయాల్సి వచ్చిందని పశ్చాత్తాపపడకుండా.. ఒక అమరవీరుడు రాజీనామాలా ఉందని ఆమె విమర్శించారు. దేశ వ్యతిరేక శక్తులు (యాంటి నేషనల్స్) పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకోకుండా ఉండేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని రాజీనామా లేఖలో పేర్కొనడంపై తీవ్రంగా విమర్శించారు.
నీట్ పేపర్ లీక్ వివాదంపై ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో జంతర్ మంతర్ దగ్గర మొదలైన ఆందోళనలు..ఆయన రాజీనామాతో 36 రోజుల తర్వాత ముగిశాయి ప్రారంభమై, దేశవ్యాప్తంగా ఇతర నగరాలకు కూడా వ్యాపించాయి. ఈ నిరసనలలో జెన్-జెడ్ విద్యార్థులు పోలీసు బలగాలతో జరిగిన ఘర్షణ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
ఇన్స్టాగ్రామ్ మెసేజెస్, మీమ్స్ తో రాజకీయాలకు అతీతంగా ఉండే జెన్ జెడ్ ప్రేక్షకులను స్పందించేలా చేయడంలో సీజేపీ గొప్ప పని చేశారని యశస్విని అన్నారు.
తన తండ్రితో రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పింది. తాను ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ అని, సొంతంగా జీవిస్తున్నానని, చాలా సంవత్సరాలుగా ఫతేపూర్ సదర్కు వెళ్లలేదని ఆమె చెప్పారు.
అంతకుముందు, బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సచిన్ రాహర్, ప్రధాన్ రాజీనామాను ఓపెన్ గా స్వాగతించి చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే. నా కుటుంబం ధర్మేంద్ర ప్రధాన్ తో ఉంది, కానీ నేను విద్యార్థులతో ఉన్నాను అనే క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన స్టోరీ వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ అనుచరులు ఆ ఎంపీని సంప్రదించి, ఆ పోస్ట్ను తొలగించమని కోరినట్లు వార్తలొచ్చాయి.
మరో బీజేపీ నాయకుడు అస్సాం రెవెన్యూ మంత్రి కేశబ్ మహంత కూతురు సీజేపీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ, చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నిరసనకారులతో కలిసి దిబిసా మహంత ర్యాలీలో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. దీనిపై స్పందించిన అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, పిల్లలు పెద్దయ్యాక వారు చేసే పనులను తల్లిదండ్రులతో ముడిపెట్టకూడదని , ట్రోల్ చేయవద్దని ప్రజలను కోరడం చర్చనీయాంశంగా మారింది.
