టీచర్ల ట్రాన్స్​ఫర్లపై మరోసారి సందిగ్ధం 

టీచర్ల ట్రాన్స్​ఫర్లపై మరోసారి సందిగ్ధం 

 గతంలో ఉమ్మడి జిల్లాలవారీగా చేయాలనుకున్న సర్కారు 
  కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదంతో అయోమయం 
 అంతర్ జిల్లా, స్పౌస్, మ్యూచువల్ బదిలీలకు రంగం సిద్ధం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు స్కూల్​టీచర్ల బదిలీలపై మరోసారి సందిగ్ధం నెలకొంది. నిన్నమొన్నటి వరకు పాత పది జిల్లాల ప్రకారమే ప్రమోషన్లు, బదిలీలు నిర్వహించాలని సర్కారు భావించగా, కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో అయోమయం నెలకొంది. దీనిపై స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు సర్కారుకు లెటర్​రాశారు. మరోపక్క సోమవారం బదిలీలు, ప్రమోషన్లపై విద్యాశాఖమంత్రి సబితారెడ్డి అధికారులతో సమీక్షించనున్నట్టు తెలిసింది. స్టేట్​లో 26,050 సర్కారు, లోకల్ బాడీ స్కూళ్లుండగా, వాటిలో 1.6 లక్షల మంది టీచర్లు పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015, 2018 సంవత్సరాల్లో టీచర్ల ట్రాన్స్​ఫర్లు జరిగాయి. రూల్స్​ప్రకారం 8 ఏండ్లు సర్వీస్​ పూర్తి చేసుకున్న టీచర్లు, ఐదేండ్లు సర్వీస్ పూర్తయిన హెడ్మాస్టర్లు తప్పనిసరిగా బదిలీ కావాలి. రెండేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నవారూ ట్రాన్స్​ఫర్లకు అర్హులే. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో జరిగిన బదిలీల్లో పోస్టింగ్​లు పొంది, ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నవారంతా ప్రస్తుతం ట్రాన్స్​ఫర్ కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కొంతకాలంగా టీచర్ల బదిలీలపై వెనకాముందు అవుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు ఉంటాయని సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఆ దిశగా నేటికీ చర్యలు చేపట్టలేదు. బదిలీలు చేపట్టకపోవడంతో ఏండ్ల నుంచి వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో బడులు ఓపెన్ కాలేదు. స్టూడెంట్లకు ఇబ్బంది లేని ఈ టైమ్​లోనే ఆన్​లైన్​లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని టీచర్లు కోరుతున్నారు. 
కొత్త జిల్లాల ప్రకారమైతే తీవ్ర జాప్యం
పాత పది జిల్లాల ప్రకారమే బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. అదే సమయంలో 33 జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు అందాయి. మరోపక్క టీచర్ల రిక్రూట్​మెంట్​తో పాటు అన్ని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొత్త జిల్లాల ప్రకారమే జరుగుతోంది. దీంతో పాత పది జిల్లాల ప్రకారం బదిలీలు నిర్వహిస్తే, లీగల్​గా సమస్యలు వచ్చే అవకాశముందని కొందరు ఆఫీసర్లు చెప్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 33 జిల్లాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదు. దీంతో పాత పది జిల్లాల ప్రకారం నిర్వహించుకునే అవకాశముందని టీచర్ల సంఘాల లీడర్లు చెబుతున్నారు. కొత్త జిల్లాల ప్రకారం చేయాలంటే ముందుగా ఉమ్మడి జిల్లా యూనిట్​గా పనిచేస్తున్న టీచర్లకు సొంతజిల్లాల ఎంపికకు ఆప్షన్ ఇవ్వాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చాలా ఆలస్యమయ్యే అవకాశముంది. గతంలో సీఎం కేసీఆర్​చెప్పిన ప్రకారం ఉమ్మడి జిల్లాల ప్రకారమే టీచర్ల బదిలీలు చేపట్టాలని టీచర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
ఏజెన్సీ ఏరియాల్లో ఎట్ల?
ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ ఏరియాల వారీగా ఇప్పటివరకూ టీచర్ల బదిలీలు జరిగేవి. దీనికి సంబంధించిన జీవోనెంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని టీచర్లు నాన్ ఏజెన్సీకి ట్రాన్స్​ఫర్ పెట్టుకోవడానికి అవకాశముంది. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసినా, ఇప్పటికీ అది బెంచీ మీదికి రాలేదు. దీంతో ప్రస్తుతం జిల్లానే సింగిల్ యూనిట్​గా భావించి, టీచర్ల బదిలీలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే దీనిపై సర్కారు ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీనిపై లీగల్ ఓపీనియన్ తీసుకుంటున్నట్టు తెలిసింది. 
మూడు కేటగిరిలకు ఓకే
వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న టీచర్లను వారి సొంత జిల్లాలకు బదిలీ చేసేందుకు సర్కారు నిర్ణయించింది. దీనికితోడు స్పౌస్, మ్యూచువల్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైల్​ఇప్పటికే సర్కారుకు చేరింది. అయితే ఈ బదిలీలు జరగాలంటే జీవో పంబర్ 3పై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై సర్కారు నిర్ణయం చెబితే, ముందుగా ఈ మూడు కేటగిరిల బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ రెడీగా ఉంది. ఏదేమైనా వారంలో వీటిపై స్పష్టత వచ్చే అవకాశముంది.