
- అవతరణ దినోత్సవాన్ని నిరసిస్తూ పలుచోట్ల ఆందోళనలు
- ఆంధ్రా దోపిడీదారులకే కాంట్రాక్టులంటూ మండిపాటు
- ద్రోహులకు పదవులిచ్చారని ఫైర్
- అమరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని ఆవేదన
రాష్ట్ర సర్కార్ నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను నిరసిస్తూ ఓయూలో విద్యార్థి సంఘాల లీడర్లు ఆర్ట్స్ కాలేజీ వద్ద నల్లబ్యాడ్జీలు, నల్ల రిబ్బన్లతో ఆందోళన చేపట్టారు.
బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులకు అన్యాయం
మహబూబాబాద్ అర్బన్/జగిత్యాల/గద్వాల, వెలుగు: మానుకోట రాళ్ల సాక్షిగా తెలంగాణ ఉద్యమకారులకు, అమరులకు స్వరాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగిందని మానుకోట ఉద్యమకారులు మండిపడ్డారు. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవారం అధికారపార్టీ లీడర్లంతా ఓవైపు సంబరాల్లో మునిగి తేలితే, నాడు తెలంగాణ కోసం ముందుండి కొట్లాడిన ఉద్యమకారులు పలుచోట్ల వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ‘దగాపడ్డ తెలంగాణ మానుకోట ఉద్యమకారుల వేదిక’ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఉద్యమకారులు దార్ల శివరాజ్, బొర్రాజు లింగన్న, సుధాకర్, పోల్రాజు, నిలేశ్రాయ్, రాము, రామకృష్ణ, సాయి. హైమాద్ఖాన్, హన్మంతు, చారి, శ్రీనివాస్, వీరన్న, అదిల్పాషా జాతీయ జెండా ఆవిష్కరించారు. తర్వాత మాట్లాడుతూ నాడు ఆంధ్రా దోపిడీదారులకు, తెలంగాణద్రోహులకు వ్యతిరేకంగా తాము పోరాడామని, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అదే ఆంధ్రా దోపిడీ దారులకు కాంట్రాక్టులు, తెలంగాణ ద్రోహులకు ప్రభుత్వంలో పదవులు కట్టబెట్టిందన్నారు. ఉద్యమకారులను, అమరుల కుటుంబాలను బీఆర్ఎస్ మోసం చేసిందని ఆరోపించారు.
బిచ్చమెత్తి నిరసన..
గోసి, గొంగడితో కాళ్లకు గజ్జెకట్టి నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన తమలాంటి ఉద్యమ కళాకారులను దశాబ్ది ఉత్సవాలకు పిలవలేదని, తెలంగాణ ద్రోహులను మాత్రమే పిలిచి సంబరాలు చేస్తున్నారని తెలంగాణ ఉద్యమ కళాకారులు ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సర్కారుకు తీరుకు నిరసనగా జగిత్యాల జిల్లా రాయికల్ లో పలువురు ఉద్యమకళాకారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జోలపట్టి భిక్షాటన చేశారు. వారు మాట్లాడుతూ ఉద్యమంలో కళాకారులుగా కొట్లాడి, సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నామన్నారు. రాష్ట్రం వస్తే కొలువులు వచ్చి బాగుపడతామనుకున్నామని, కానీ ఈ సర్కారు తమను రోడ్డుపాలుజేసిందన్నారు. నాడు రాష్ట్ర సాధనకు అడ్డుపడినవాళ్లంతా ఇవాళ వేడుకలు జరుపుకుంటున్నారని, తాము రోడ్డెక్కి నిరసన తెలిపే పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు మరోసారి గజ్జె కట్టి పాడుతామన్నారు. తెలంగాణ సామాజిక ఉద్యమ బంజారా రచయిత, గాయకుడు గంగధర్ నాయక్, బహుజన గళం లింగంపల్లి నరేశ్, జంగిలి స్వామి, ప్రసన్న కుమార్, ఉప్పుగండ్ల సాయి రాజ్, రజనీ కాంత్, మహేష్, కళకారులు పాల్గొన్నారు.
ఉద్యమకారుల ఆశయాలు నెరవేరలే..
స్వరాష్ట్రంలో ఉద్యమకారుల ఆశయాలు నెరవేరలేని బీఆర్ఎస్ సీనియర్ లీడర్, ఉద్యమకారుడు నాగర్ దొడ్డి వెంకట్రాములు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమకారులకు 20 శాతం టికెట్లు కేటాయించాలని, నామినేట్ పోస్టులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గద్వాలలోని స్మృతి వనంలో అమరవీరుల స్తూపానికి బహుజన రాజ్యసమితి, ప్రజా సంఘాలు, బీసీ లీడర్లు కలిసి నివాళులర్పించారు. వెంకట్రాములు మాట్లాడుతూ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. బీసీ రాష్ట్ర నాయకులు మధుసూదన్ బాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీసీల జనాభా ఆధారంగా బీసీలకు టికెట్లు ఇవ్వని పార్టీలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. వాల్మీకి, వినోద్ కుమార్, టవర్ మక్బుల్ ,రవి పాల్గొన్నారు.
వేడుకలు నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం..
పటాన్చెరు, వెలుగు : పేదలను పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం అవతరణ దశాబ్ది వేడుకలను నిర్వహించడాన్ని నిరసిస్తూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల కు చెందిన అన్వర్ తెలంగాణ వచ్చిన కొత్తలో డబుల్ బెడ్రూం ఇంటి కోసం అప్లై చేసుకున్నాడు. పదేండ్లు గడిచినా ఇల్లు మాత్రం రాలేదు. దీంతో ప్రభుత్వం తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న అన్వర్ శుక్రవారం అవతరణ వేడుకలను నిరసిస్తూ బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాడు. పోలీసులు, జడ్పీటీసీ సభ్యుడు కుమార్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని అన్వర్ను బుజ్జగించి టవర్ పై నుంచి కిందకు దింపారు. టవర్ దిగిన తర్వాత అన్వర్ తన బాధను చెప్పుకున్నాడు. తెలంగాణ వచ్చిన కొత్తలో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ చెప్తే నమ్మామని, కానీ పదేండ్లు కావస్తున్నా ఇల్లు మంజూరు చేయలేదని వాపోయాడు. ఇల్లు లేక తమ కుటుంబం కష్టాలు పడుతోందన్నాడు. పేదలకు ఏమీ చేయని సర్కారు దశాబ్ది వేడుకలను నిర్వహించడమేమిటని నిరసనగా టవర్ ఎక్కినట్లు చెప్పాడు. ప్రభుత్వం ఇప్పటికైనా నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశాడు.
ఓయూలో విద్యార్థుల అరెస్ట్
ఓయూ : దశాబ్ది ఉత్సవాలను నిరసిస్తూ ఓయూలో విద్యార్థి సంఘాల లీడర్లు ఆర్ట్స్ కాలేజీ వద్ద నల్ల బ్యాడ్జీలు, నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు రాగా, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విద్యార్థులను అరెస్టు చేసి ఓయూ పీఎస్కు తరలించారు. ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ మిడతనపల్లి విజయ్, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు వేల్పుల సంజయ్, జేఏసీచైర్మన్ కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. విద్యార్థి అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ రాష్ట్రం ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబ దోపిడీ వల్ల అప్పులపాలైందన్నారు. నాలుగు కోట్ల మంది కొట్లాడితే ఒక్క కేసీఆర్ కుటుంబానికి చెందిన నలుగురు మాత్రమే తెలంగాణ సంపదను దోచుకుని దాచుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి దశాబ్ది ఉత్సవాలను విరమించుకొని ప్రగతి తెలంగాణ కోసం పాటుపడాలని హితవు పలికారు. శుక్రవారం తెల్లవారు జాము నుంచే పోలీసులు ఓయూ హాస్టళ్లకు వెళ్లి స్టూడెంట్లను అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వెంకట్యాదవ్, బోరెల్లి సురేశ్, నాగరాజు, ధాత్రిక స్వప్న, ఈశ్వర్, దేవేందర్, వేణుగోపాల్, దశరథ్, మోహన్నాయక్, బొమ్మెర స్టాలిన్ పాల్గొన్నారు.