
లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ రిషబ్ పంత్ తన అస్త్రాన్ని మరోసారి ప్రయోగించాడు. అదేంటో కాదు బ్యాటర్ ఏకాగ్రత చెడగొట్టడానికి ఫిజియో అవసరమని సూచించాడు. ఆదివారం (జూన్ 22) మూడో రోజు ఆటలో భాగంగా హ్యారీ బ్రూక్ 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో పంత్ తనకు మెడికల్ ట్రీట్ మెంట్ కావాలని కోరాడు. గ్రౌండ్ లో కాసేపు ఫిజియో వచ్చి పంత్ కు చికిత్స అందించడంతో మ్యాచ్ కు కొన్ని నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత బ్రూక్ 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు.
ప్రసిద్ కృష్ణ వేసిన బౌన్సర్ ను ఆడే క్రమంలో బ్రూక్ పుల్ షాట్ ఆడి ఫైన్ లెగ్ లో ఫీల్డర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటివరకు అలవోకగా పరుగులు చేస్తూ ఇంగ్లాండ్ ను ముందుకు తీసుకెళ్తున్న బ్రూక్ వికెట్ భారత్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. బ్రూక్ వికెట్ రావడానికి రిషబ్ పంత్ తెలివితేటలు పని చేశాయి. పంత్ ఇలా చేయడం కొత్తేమీ కాదు. గతంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్న సమయంలో పంత్ ఎత్తుగడ భారత్ కు కప్ అందించడంలో సహాయం చేశాయి.
క్లాసెన్, మిల్లర్ మ్యాచ్ ముగించేలా ఉన్న సమయంలో గాయం సాకుతో పంత్ సమయాన్ని వృథా చేశాడు. ఇలా చేయడం టీమిండియాకు అనుకూలంగా మారింది. ఆ నాలుగైదు నిమిషాలలో క్లాసెన్ ఏకాగ్రత కోల్పోకోల్పోయి తన వికెట్ కోల్పోయాడు. ఇక్కడ నుంచి భారత బౌలర్లు విజృంభించి సౌతాఫ్రికాను ఓడించి టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్నారు. ఇటీవలే జరిగిన ఐపీఎల్ 2025లోనూ పంత్ ఇలాగే చేశాడు. 238 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోల్ కతా నైట్ రైడర్స్ గెలుపు దిశగా దూసుకెళ్తుంది. ఈ సమయంలో పంత్ ఫిజియాను సంప్రదించారు. ఆ తర్వాత కేకేఆర్ జట్టు ఒక్కసారిగా కుప్పకూలి మ్యాచ్ ఓడిపోయింది. ప్రతిసారి పంత్ ఎత్తుగడ వర్కౌట్ అవ్వడం హైలెట్ గా మారింది.