వికారాబాద్ జిల్లా కాళ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో శిరీష బావ అనిల్, అతని స్నేహితులు కలిసి శిరీషను హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. శిరీష కేసులో మూడు రోజులుగా పోలీసుల ఎదుట అనిల్ నోరు మెదపడం లేదు. అయితే అనిల్ కాల్ డేటా ఆధారంగా అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఏం జరిగిందంటే..
హత్య జరిగిన రోజు శిరీష చెప్పిన మాట వినడం లేదని... ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఉంటుందని ఆమెతో అనిల్ వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో శిరీష మరో రూంలోకి వెళ్ళి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. రూం లాక్ విరగొట్టి శిరీషను బయటకు తీసుకొచ్చిన అనిల్..ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. ఆ తర్వాత అతను పరిగి వెళ్ళిపోయాడు. బావ అనిల్ కొట్టడంతో మనస్థాపానికి గురైన శిరీష.. బయటకు వెళ్ళిపోయింది. శిరీష ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయాన్ని ఆమె తమ్ముడు.... అనిల్ కు ఫోన్ చేసి చెప్పాడు. అప్పటికే తన స్నేహితులతో కలిసి అనిల్ ఫుల్గా మందు తాగాడు. మరో మద్యం బాటిల్ తీసుకుని స్నేహితులతో కలిసి కాళ్లాపూర్ బయలుదేరాడు. ఊరు శివారులో ఉన్న మైసమ్మ గుడి దగ్గర అనిల్ కు శిరీష కనిపించింది. అప్పటికే కోపంతో ఉన్న శిరీషపై మరోసారి అనిల్ చెయ్యి చేసుకున్నాడు. అక్కడే ఉన్న కుంటవైపు లాకెళ్ళి వెంటతెచ్చుకున్న బీరు బాటిల్ను పగుల గొట్టి అనిల్ ఫ్రెండ్ శిరీష కళ్ళల్లో గుచ్చాడు.
వదిలేయండి ప్లీజ్..
తనను వదిలేయాలని శిరీష ఎంత బతిమిలాడినా నిందితులు వదల్లేదు. మోకాలు లోతు నీరున్న కుంటలోకి శిరీషను అనిల్ ..అతని స్నేహితుడు కలిసి కలిసి విసిరి పారేశారు. శిరీష చనిపోయే వరకూ కూడా ఆమె శరీరంపైనే అనిల్ స్నేహితుడు నిలుచున్నాడు. చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడ ఆనవాళ్ళను మాయం చేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం తెలియనట్లు..అనిల్..అతని స్నేహితుడు శిరీష కోసం వెతుకుతున్నట్టు నటించారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులు పోలీసుల కస్టడీలోనే ఉన్నారు.