కిలో మామిడి పండ్లు రూ. 2లక్షల11వేలు.. మియాజాకి మామిడి పండు రికార్డు

కిలో మామిడి పండ్లు రూ. 2లక్షల11వేలు.. మియాజాకి మామిడి పండు రికార్డు

కిలో మామిడి పండ్ల ధర ఎంతుంటుంది..? మహా అయితే 150 రూపాయలు.. రకాన్ని బట్టి 300 రూపాయలు..  అయితే ఓ రైతు ప్రత్యేకంగా పండించిన  మామిడి పండ్ల ధర ఏకంగా 2లక్షల 11 వేలు పలికింది. ఆశ్చర్యపోతున్నారా.. ఇదినిజం.. యూపీకి చెందిన ఓ రైతు పండించిన  జపాన్  కు చెందిన మియాజాకి మామిడిపండ్లను ఓ వ్యాపారి అత్యధిక ధరకు కొనుగోలు చేశారు. ఈ మామిడి ప్రత్యేకత ఏంటీ.. ఎందుకు  వ్యాపారి అంత ధర పెట్టి కొనుగోలు చేశాడో వివరంగా తెలుసుకుందాం..    

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లా థరోలి గ్రామానికి చెందిన రైతు సందీప్ చౌదరి కేవలం ఒక కిలో బరువున్న నాలుగు మియాజాకి మామిడి పండ్లను రూ.2.11 లక్షలకు విక్రయించి కొత్త రికార్డు సృష్టించారు. ఈ అరుదైన మామిడి పండ్లను గుజరాత్‌లోని సూరత్‌లో నివసిస్తున్న వ్యాపారవేత్త ప్రవీణ్ గుప్తా కొనుగోలు చేశారు. అనారోగ్యంతో ఉన్న తన 80 ఏళ్ల తల్లికి ప్రత్యేక బహుమతిగా ఈ పండ్లను అందించారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ రూ.3.5 లక్షల వరకు ఉన్నప్పటికీ, తల్లిపై ఉన్న ప్రేమను గుర్తించిన రైతు సందీప్ చౌదరి ధరను తగ్గించి రూ.2.11 లక్షలకు విక్రయించారు.రికార్డు ధరను పొందడమే కాకుండా ఈ పండ్ల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంలో 10 శాతం పేదలకు విరాళంగా ఇస్తానని కూడా సందీప్ చౌదరి ప్రకటించడం మరో హైలైట్. 

మూడేళ్లుగా ఈ మామిడి సాగు చేస్తున్నారు సందీప్ చౌదరి. చాలామంది ఈ మామిడి తోటను సాగు చేస్తున్నప్పుడు ఎగతాళి చేశారట. అయితే ఇప్పుడు అదే పంట తనకు గుర్తింపు తెచ్చిందని రైతు సందీప్ చౌదరి గర్వంగా చెప్పుకుంటున్నారు.  రెండు మొక్కలతో ప్రారంభించిన తోటలో ప్రస్తుతం 40 మియాజా మామిడి చెట్లు పెంచుతున్నారట. పండ్ల విలువ ఎక్కువగా ఉండటంతో దొంగతనాలు జరగకుండా తన తోటలో సీసీటీవీ కెమెరాలు, సెన్సార్ లైట్లు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. 

మియాజాకి రకం మామిడి తీపి రుచి, అధిక పోషక విలువలతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ రకం మామిడి సాగుతో అధిక విలువ కలిగిన పంటలు సాగు చేస్తే  రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చని నిరూపించారు రైతు. ఈ రికార్డు స్థాయి అమ్మకం భారతీయ రైతులకు ఒక ప్రధాన ఆచరణాత్మక నిరూపణ అని ఉద్యానవన నిపుణులు చెబుతున్నారు.