- 75ఏళ్ల వయసులో సైకిల్, రన్నింగ్ రేసుల్లో పతకాలు గెలిచిన సుభాష్ పాండే
కొన్ని కథలు మనసుని కదిలిస్తాయి. ఏదైనా సాధించగలమనే ధైర్యాన్నిస్తాయి. అప్పటివరకూ అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసి చూపెడతాయి. పదిమందికి ఆదర్శంగా నిలబెడతాయి. 75 ఏళ్ల సుభాష్ పాండే జీవితంలోనూ అదే జరిగింది. ఒక కథ ఈ హైదరాబాదీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సైక్లింగ్, రన్నింగ్లో ఎన్నో అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏంటా కథ?ఎవరీ సుభాష్ పాండే?
అది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సుభాష్ పాండే రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఉద్యోగం చేస్తున్నప్పుడు రిటైర్మెంట్ తర్వాతి జీవితం గురించి బోలెడు కలలు కన్నాడు. కానీ, కొద్దిరోజులకే ఆయన కలలన్నీ తేలిపోయాయి. దాంతో ఏదో తెలియని వెలితి వెంటాడింది. రోజంతా ఇంట్లో ఉండటం వల్ల తనని తాను కోల్పోతున్నట్టు అనిపించింది సుభాష్కి. దాంతో భార్య పనిచేస్తున్న స్కూల్లో టీచర్గా చేరాడు. ఆ ఉద్యోగమే అతన్ని 75 ఏళ్ల వయసులో సైక్లిస్ట్ని చేసింది.
ఆ కథ కదిలించింది
అందరు టీచర్స్లా స్టూడెంట్స్కి పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే చెప్పాలనుకోలేదు సుభాష్. వాళ్లని ఇన్స్పైర్ చేయడానికి ఎన్నో సక్సెస్ఫుల్ కథల్ని ఎంచుకున్నాడు. అలా ఒకరోజు పిల్లలకి ఎవరెస్ట్ ఎక్కిన మొదటి భారతీయ మహిళ బచేంద్రి పాల్ గురించి చెప్పాడు. ఆమె కథ విని స్టూడెంట్స్ చప్పట్ల వర్షం కురిపించారు. ‘పెద్దయ్యాక మేం కూడా ఎవరెస్ట్ ఎక్కుతాం సర్’ అని చెప్పారు. ఆ వెంటనే ‘అరుణిమ సిన్హా’ అనే మరో ఇన్స్పైరింగ్ కథ క్లాస్లో వినిపించింది. అయితే ఈ కథ కేవలం స్టూడెంట్స్నే కాదు ఆయన్ని కూడా కదిలించింది. ఆర్టిఫిషియల్ కాలుతో అరుణిమ ఎవరెస్ట్ ఎక్కిందని తెలిశాక..నేనెందుకు ట్రై చేయకూడదు అనుకున్నాడు సుభాష్. ఆ ఆలోచనే అతడి రన్నింగ్, సైక్లింగ్ వైపు నడిపించింది. నాసిక్లో జరిగిన నేషనల్ వెటరన్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఛాంపియన్షిప్లో నాలుగు మెడల్స్ గెలుచుకునేలా చేసింది. అది కూడా మోకాలి– రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత.
అయితే ఏంటి?
సుభాష్ రెండు మోకాళ్లకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయింది. ఆపరేషన్ తర్వాత ‘నువ్వు ఎప్పటికీ పరిగెత్తలేవ’ని చెప్పారు డాక్టర్లు. అయినా ధైర్యం చెడకుండా మెల్లిగా నడక మొదలుపెట్టాడు సుభాష్. కొద్దిరోజుల్లోనే అందర్నీ సర్ప్రైజ్ చేస్తూ పరిగెత్తాడు. ప్యాండెమిక్లో సైకిల్ కూడా ఎక్కాడు. లాక్డౌన్లో వీధులన్నీ ఖాళీగా ఉండడంతో ఇంటి దగ్గర్లో రోజుకి పన్నెండు గంటలు సైకిల్ ప్రాక్టీస్ చేశాడు. వీకెండ్స్లో పది, ఇరవై కిలోమీటర్లు సైకిల్పైనే తిరిగాడు. కానీ, అంతలోనే అతనికి ప్రతి అడుగులో తోడుండే భార్య చనిపోయింది. ఒక్కసారిగా జీవితం చీకటిగా అనిపించింది. ఆ బాధ నుంచి బయటపడటానికి మళ్లీ సైక్లింగ్నే ఎంచుకున్నాడు సుభాష్. మార్చిలో తన భార్య జ్ఞాపకంగా నలభై కిలోమీటర్లు సైకిల్ రైడ్ చేశాడు. ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు నాసిక్లో జరిగిన మొదటి నేషనల్ వెటరన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఛాంపియన్షిప్లోనూ పార్టిసిపేట్ చేశాడు సుభాష్. పదికిలోమీటర్ల రన్నింగ్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. 30 కిలోమీటర్ల సైక్లింగ్లో గోల్డ్ మెడల్, ఐదు కిలోమీటర్ల రన్నింగ్, వాకింగ్ ఈవెంట్లలో రెండు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుని ఎందరికో ఇన్స్పిరేషన్ అయ్యాడు. వచ్చేనెల ఐదున తన 53 వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా సైకిల్పై మల్కాజిగిరి నుంచి యాదగిరిగుట్ట వెళ్లే ప్లాన్లో ఉన్నాడు ఈ సైక్లిస్ట్.