తిరువనంతపురం : ప్రార్థనా స్థలాలకు యువతను ఆకర్షించాలంటే ఆలయాల్లో లైబ్రెరీలను ఏర్పాటు చేయాలని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. కేరళలోని తిరువనంతపురంలోని శ్రీఉడియన్నూర్ దేవి టెంపుల్ ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆలయ అధికారులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్ అవార్డు అందజేశారు.
అనంతరం సోమనాథ్ మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి యువకులు పెద్ద సంఖ్యలో వస్తారని అనుకున్నా. కానీ, వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆలయాలు దేవుడి నామస్మరణ కోసం వచ్చే వృద్ధులకు మాత్రమే కాదు.. సమాజాన్ని మార్చే ప్రదేశాలుగా మారాలి. అందుకోసం యువతను ఆలయా ల వైపు ఆకర్షించేందుకు నిర్వాహకులు కృషి చేయాలి. దేవాలయాల్లో లైబ్రరీలను ఎందుకు ఏర్పాటు చేయకూడదు?” అని ప్రశ్నించారు. దీనివల్ల చదువుకోవాలని అనుకుంటున్న యువత టెంపుల్స్ వైపు ఆకర్షితులవుతారని పేర్కొన్నారు.
