14 అర్బన్ పార్కులకు కేంద్రం గ్రీన్సిగ్నల్!

14 అర్బన్ పార్కులకు కేంద్రం గ్రీన్సిగ్నల్!
  • నగర్ వన్ యోజన కింద రూ.28 కోట్లు కేటాయింపు
  • 14 మున్సిపాలిటీల్లో నిర్మాణానికి అటవీ శాఖ ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: కాంక్రీట్  జంగిల్స్‌‌‌‌‌‌‌‌గా మారుతున్న పట్టణాలు పచ్చందాలను సంతరించుకోనున్నాయి. తాజాగా మరో 14 అర్బన్ ఫారెస్ట్ పార్కులు (నగర్ వనాలు) అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో 9 జిల్లాల్లోని మున్సిపాలిటీల పరిధిలో ఈ పార్కులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నగర్ వన్ యోజన’ కింద వీటికి నిధులు మంజూరు చేస్తున్నది. ఒక్కో పార్కుకు రూ.2 కోట్ల చొప్పున.. మొత్తం 14 పార్కులకు రూ.28 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ఆయా మున్సిపాలిటీల్లోని అటవీ బ్లాకుల్లో పార్కులను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర అటవీ శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో మరో14 పార్కుల నిర్మాణానికి అటవీ శాఖ ప్రపోజల్స్ పంపించగా.. కేంద్రం ఆమోదం తెలిపింది. 

ఒక్కో పార్కుకు రూ.2 కోట్లు మంజూరు చేసింది. మంచిర్యాల జిల్లాలో రెండు, ఆదిలాబాద్ జిల్లాలో రెండు, మేడ్చల్–మల్కాజిగిరిలో 2, వికారాబాద్​లో 4, భూపాలపల్లి 1, కొత్తగూడెంలో 1, జగిత్యాలలో 1, పెద్దపల్లిలో 1చొప్పున పార్కులు నిర్మించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. పార్కుల చుట్టూ ప్రహరీల నిర్మాణం, కంచెల ఏర్పాటు, ఎంట్రన్స్ ఆర్చ్ గేటు, వాకింగ్– జాగింగ్ ట్రాక్‌‌‌‌‌‌‌‌లు, యోగా షెడ్లు, ఓపెన్ జిమ్స్, పిల్లల కోసం ప్లే ఏరియా, వనభోజనాలకు అనువైన ప్రాంతాలు, తాగునీరు, వాష్ రూమ్స్ సౌకర్యం, సైక్లింగ్, బెంచీలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. కాగా, అటవీ శాఖ ఆధ్వర్యంలో దాదాపు రూ.360 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 75,748 ఎకరాల్లో 109 అర్బన్  పార్కుల ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళ్తున్నది.