
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన రెండ్రోజుల్లో 57 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. గురువారం కొత్తగా 27 మందికి వైరస్ ఉన్నట్టు తేలిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 154కు పెరిగింది. ఇందులో 14 మంది ఇప్పటికే వైరస్ నుంచి కోలుకుని ఇంటికెళ్లిపోగా, గురువారం మరో ముగ్గురిని డిశ్చార్జ్ చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఇంకో 128 మంది గాంధీ, కింగ్ కోఠి, చెస్ట్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 9 మంది మరణించారు.
బుధవారం కరోనా కేసుల వివరాలను వైద్యారోగ్యశాఖ, సీఎం ఆఫీస్ ప్రకటించగా, గురువారం మంత్రి ఈటల ప్రకటించారు. ఓ తెల్ల కాగితంపై లెక్క రాసి మీడియాకు విడుదల చేశారు. అయితే కొత్తగా వైరస్ బారిన పడ్డవారు ఎవరన్నది మంత్రి స్పష్టం చేయలేదు. వాళ్లు ఏ జిల్లా వాళ్లన్నది కూడా ప్రకటించలేదు. కానీ మహబూబ్నగర్, ములుగు, జనగామ, సంగారెడ్డి, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో కరోనా కేసులు నమోదైనట్టు ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు ప్రకటనలు విడుదల చేశారు.
వందల సంఖ్యలో కాంటాక్ట్స్
మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో పలువురికి గురువారం చేసిన టెస్టుల్లో పాజిటివ్గా తేలింది. వీరు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత 11 రోజులు ఉద్యోగాలు, పనులకు అటెండ్ అయ్యారు. జనగామ జిల్లాలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి వారం రోజులు మటన్ షాపు నిర్వహించాడు. రెండు ఫంక్షన్లకు వెళ్లాడు. ఆయనతో కాంటాక్ట్ అయిన 69 మందిని క్వారంటైన్కు తరలించారు. ములుగు జిల్లాలోని ఇద్దరిలో ఓ వ్యక్తి తర్వాత కిరాణా షాపు నిర్వహించాడు. ఇలా చాలా మంది ఈ 11 రోజుల్లో వందల మందిని కలిశారు. హెల్త్ ఆఫీసర్లు వాళ్లందరినీ గుర్తించే పనిలో పడ్డరు. వీళ్లు వచ్చిన రైలు బోగీల్లో ప్రయాణించిన వాళ్ల వివరాలు ఇవ్వాలని రైల్వే అధికారులను ఆరోగ్యశాఖ కోరింది. అయితే వారు జనరల్ టికెట్పై రావడంతో గుర్తించడం కష్టంగా మారింది.
సంగారెడ్డి జిల్లాలో ఆరుగురికి పాజిటివ్
సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి పట్టణంలో ఇద్దరికి, అంగడిపేట గ్రామంలో ఇద్దరికి, కొండాపూర్, జహీరాబాద్ లలో ఒక్కొక్కరికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
మర్కజ్ కు వెళ్లొచ్చిన వారిలో 400 మందికి కరోనా