- జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం..
- డోడా జిల్లాలో యాక్సిడెంట్
జమ్మూ: వేగంగా దూసుకొచ్చిన కారు మూలమలుపు వద్ద అదుపు తప్పింది.. రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఏడు వందల మీటర్ల ఎత్తునుంచి కిందపడడంతో కారు ఇనుప తుక్కులా మారింది. జమ్మూ కాశ్మీర్లో మంగళవారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్కరు మాత్రం తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ఇప్పుడు ఆస్పత్రి బెడ్ మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మర్మాత్లోని గౌవా విలేజ్ నుంచి క్లీనికి వెళుతుండగా ఎస్యూవీ కంట్రోల్ తప్పింది. రోడ్డు మీద స్కిడ్ అయి, పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
డోడా జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే చనిపోగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చనిపోయిన వారిలో ఐదుగురు ఆడాళ్లు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గాయాలతో బయటపడ్డ బాధితుడి ఆరోగ్య పరిస్థితి సీరియస్గా మారడంతో ప్రైవేటు ఆస్పత్రి నుంచి జమ్మూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. మరో ఘటనలో రోడ్డు దాటుతుండగా ట్రక్ ఢీ కొట్టడంతో ఏడో తరగతి పిల్లాడు చనిపోయాడు. జమ్మూ శివార్లలో మిరాన్ సాహిబ్ ఏరియాలో ట్రక్ పడి సుమిత్ అనే కుర్రాడు చనిపోయాడు.