Weather update: నిప్పుల కొలిమి ..... తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

Weather update: నిప్పుల కొలిమి ..... తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

సూర్యుడు సుర్రుమంటున్నాడు. తెలుగు రాష్ట్రాలపై సెగలుగక్కుతున్నాడు. భానుడి భగభగలకు ఎండలు మండిపోతున్నాయ్‌. ఉష్ణోగ్రతలు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంగా మారిపోయాయి. కనిష్టంగా 42 .. గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవడంతో .. జనం బయటకు అడుగుపెట్టేందుకే జంకుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో వేడి తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి( ఏప్రిల్​ 29,30) ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి  నెల చివరి వారం నుంచి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవుతోంది.  ఏపీ, తెలంగాణల్లో ఉక్కపోత, వడగాలులతో జనం అల్లాడిపోతున్నారు. పగలు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ ఏడాది మార్చి నెలలోనే  ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేశాయి.

తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. రాష్ట్రంలో 42 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తెలంగాణ నిప్పులగుండంగా మారుతోంది. 10 రోజులుగా ( ఏప్రిల్​28 నాటికి)  సూర్యుని ప్రతాపానికి.. జనం చెమటలుగక్కుతున్నారు. బయటకు రావడానికి అల్లాడుతున్నారు. మరో 10 రోజుల పాటు తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

తెలంగాణలో రెండు జిల్లాల్లో తప్ప అన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, గద్వాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో  ఉష్ణోగ్రత 43 డిగ్రీలను దాటింది.నల్గొండ జిల్లాలోని నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా నిన్న ( ఏప్రిల్​ 27) ఆదిలాబాద్‌ జిల్లాలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైదరాబాద్​ లో..

హైదరాబాద్​ లో  ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వారం ( ఏప్రిల్​ 29 నుంచి)  రోజులు ఎండ త్రీవత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు దాటుతున్నాయని పేర్కొంది. ఇవాళ ( ఏప్రిల్​ 28)  పలు జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకావశం ఉన్నదని తెలిపింది. రాజస్థాన్‌ నుంచి విదర్భ మీదుగా వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందువల్ల ప్రజలు మధ్యాహ్నం తర్వాత బయటకి రావద్దని వాతావరణ శాఖ సూచించింది.

ఆంధ్రప్రదేశ్​ లో..

ఏపీలో.. భానుడి భగభగలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఏపీలో 44 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దాదాపు 514 మండలాల్లో  ఎండ దంచి కొడుతుంది. 152 మండలాల్లో తీవ్రమైన వేడి గాలులు ఉన్నట్లు వాతావరణశాఖ చెప్పింది. నెల్లూరు, వైఎస్సార్, తిరుపతి, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఎక్కువ మండలాల్లో .. ఎండ ప్రభావం అధికంగా ఉంది.

రాయలసీమ జిల్లాల్లో.. ఎక్కువ ప్రాంతాల్లో ఎండ వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మరో వారం రోజుల పాటు ( ఏప్రిల్​ 29 నుంచి) ఇదే తరహా వాతావరణం ఉంటుందని .. అధికారులు తెలిపారు.  పలు ప్రాతాల్లో వడదెబ్బకు కొంతమంది మృతి చెందినట్టు సమాచారం అందుతోంది.  అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. 

 మన్యంలో వడగాల్పులు…

 ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో తీవ్రవడగాల్పులు వీస్తున్నాయి. ఇంకా పది రోజుల పాటు ( ఏప్రిల్​ 29 నుంచి)  130 మండలాల్లో వడగాల్పులు,  5 మండలాల్లో తీవ్ర, 253 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

వడగాల్పులు వీచే 130 మండలాలు

శ్రీకాకుళం 4 , విజయనగరం 19, పార్వతీపురంమన్యం 12, అల్లూరిసీతారామరాజు 4,అనకాపల్లి 13, కాకినాడ 9, తూర్పుగోదావరి 3, కృష్ణా1, ఎన్టీఆర్ 14, గుంటూరు 5, పల్నాడు6, నంద్యాల 19, అనంతపురం 1, వైఎస్సార్ 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది  మే నెలలో ఇంకా అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

1970 జనవరి 1 నుంచి 2023 జూన్‌ 30వరకు 53ఏళ్ల పాటు దేశంలో ఉష్ణోగ్రతలలో వచ్చిన మార్పులను అత్యాధునికి పద్ధతుల్లో విశ్లేషించారు. ఈ అధ్యయనంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఏటా ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.యాభై ఏళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. యాభై ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణలో సగటు ఉష్ణోగ్రత 0.5డిగ్రీలు పెరిగింది. ఏపీలో 0.9డిగ్రీలు పెరిగింది. దేశంలో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ 15వ స్థానంలో తెలంగాణ 28వస్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

 పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు రాత్రి పూట ఉక్కపోత ప్రజల్ని వేధిస్తోంది. ఏసీలు, కూలర్లకు డిమాండ్ పెరిగింది. దేశ వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలు కూడా ఉన్నాయని ఇప్పటికే ఐఎండి ప్రకటించింది. గత ఏడాది కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే హెచ్చరికలతో జనం బెంబెలెత్తి పోతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అధిక ఉష్ణోగ్రతలతో హెచ్చుతగ్గులు కూడా అధికంగా నమోదైనట్లు అమెరికన్ వాతావరణ అధ్యయన సంస్థ క్లైమేట్ ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్‌ వరకు ఏపీ, తెలంగాణల్లో వాతావరణాల్లో వస్తున్న మార్పులను విశ్లేషించారు.

ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.  వేసవిలో వ్యాధులు, వడదెబ్బకుగురి కాకుండా తగిన జాగత్తలు తీసుకోవాలని.. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆరేళ్లలోపు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలంటున్నారు.