ఇయ్యాల ( జులై 2) తొలి ఈ– కేబినెట్.. హైదరాబాద్ మెట్రో, వానాకాలం సాగు పంటలపై చర్చ

ఇయ్యాల  ( జులై 2) తొలి ఈ– కేబినెట్.. హైదరాబాద్ మెట్రో, వానాకాలం సాగు పంటలపై చర్చ
  • ​    మూసీ ఫేజ్1, వానాకాలం సాగు, వీబీ జీ రామ్ జీ పథకం అమలుపై నిర్ణయాలు

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సెక్రటేరియెట్‌‌లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో తొలి కాగిత రహిత (ఈ- కేబినెట్) సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సెక్రటేరియెట్‌‌‌‌లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో తొలి కాగిత రహిత (ఈ- కేబినెట్) సమావేశంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకోసం సీఎం సహా మంత్రులందరికీ ట్యాబ్‌‌‌‌లు అందజేశారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు కూడా ఇదే తొలి మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో మూసీ పునరుజ్జీవనం ఫేజ్1 పనులకు ఆమోద ముద్ర వేయనున్నారు.

 హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన తాజా పరిణామాలు, తదుపరి కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, ప్రాజెక్టు పురోగతిపై మంత్రివర్గం కీలకంగా సమీక్షించే అవకాశం ఉందని సమాచారం. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా కేంద్రం తీసుకొచ్చిన వీబీ జీ-రామ్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా లేదా అనే అంశంపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 ఈ పథకంలోని కొన్ని నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్‌‌‌‌ను మంత్రివర్గంలో చర్చించనున్నారు. వానాకాలం సాగు, విత్తనాలు, ఎరువుల సరఫరా, పంటల వైవిధ్యం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే చర్యలపై కూడా చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రతిపాదనలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. 

ఏపీ, తెలంగాణ మధ్య స్థానికత ఉన్న ఉద్యోగుల పరస్పర అంతర్రాష్ట్ర బదిలీలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలో ప్రతిపాదిత లోయర్ ఇన్‌‌‌‌కమ్ గ్రూప్ (ఎల్ఐజీ) హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాలు, డిజైన్లు, విధివిధానాలకు కూడా ఆమోదం తెలిపే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.