నల్గొండ అర్బన్, వెలుగు: 2023-–24 వానాకాలం సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్లలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. బుధవారం నల్గొండ మండలంలోని చిన్నసూరారంలోని ఐకేపీ సెంటర్, పానగల్, ఎస్ఎల్బీసీ బత్తాయి సెంటర్ లో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కేంద్రాలను ఆయన సందర్శించి మాట్లాడారు. జిల్లాలో 175 కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు చేస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటి వరకు 5,899 మంది రైతుల నుంచి 45,813 మెట్రిక్ టన్నులు కొని చేసి రూ.13.38 కోట్లు వారి ఖాతాలో జమచేశామని వివరించారు. 2022–--23 వానాకాలం సీఎంఆర్ 2 .98 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 2 .42 లక్షల మెట్రిక్ టన్నులు పంపించి రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిచారని అభినందించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ వెంకటేశ్వర్లు, డీఎం నాగేశ్వర రావు ఉన్నారు.