న్యూఢిల్లీ, వెలుగు: రక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. పాతబడిపోయిన ఎయిర్ఫోర్స్ ట్రాన్స్పోర్ట్ విమానాలు ‘అవ్రో 748’ల స్థానంలో కొత్త విమానాలను తీసుకోనుంది. 56 ‘సీ 295 ఎండబ్ల్యూ’ మీడియం ఎయిర్క్రాఫ్ట్లను కొనేందుకు స్పెయిన్కు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్తో రూ.20 వేల కోట్ల ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఆ విమానాలను సంస్థలు మన దేశంలోనే తయారు చేయనున్నాయి. యుద్ధ విమానాలకు సంబంధించి తొలి మేకిన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదేనని అధికారులు చెప్తున్నారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చే నాటి నుంచి నాలుగేండ్లలో పూర్తిగా తయారు చేసిన 16 విమానాలను ఆయా సంస్థలు మన దేశానికి అందిస్తాయి. మిగతా 40 విమానాలను ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్)ల కన్సార్టియం తయారు చేస్తాయి. పదేండ్లలో ఆ విమానాలను సైన్యానికి అందజేస్తాయి. విమానాల కొనుగోలుతో పాటే హ్యాంగర్లు, అప్రాన్సలు, టాక్సీ వేల రూపంలో ప్రత్యేక మౌలిక వసతులనూ ఒప్పందంలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు.
విమానాల్లో లోకల్ పరికరాలే
ఒప్పందం ప్రకారం కొనుగోలు చేసే విమానాల్లో మన దేశంలో సొంతంగా తయారుచేసుకున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లనే వాడనున్నారు. ఈ విమానాలు 5 నుంచి 10 టన్నుల కెపాసిటీని కలిగి ఉంటాయి.ఈ విమానాలను నార్తర్న్, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో మన ఎయిర్ఫోర్స్ కెపాసిటీని పెంచేందుకు ఇది దోహదపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎయిర్బస్ డిఫెన్స్, టీఏఎస్ఎల్, దేశ రక్షణ శాఖ మధ్య జరిగిన ఈ ఒప్పందం ఓ గొప్ప ముందడుగు అని టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా అన్నారు.