ఏడాదిలో 83 వేల బ్యాంకింగ్ ఫ్రాడ్స్

ఏడాదిలో 83 వేల బ్యాంకింగ్ ఫ్రాడ్స్
  • 20‌‌20‑21 లో జరిగిన  మొత్తం బ్యాంక్ ఫ్రాడ్స్‌ 83 వేలు
  • బ్యాంకులకు రూ. 1.38    లక్షల కోట్లు లాస్‌‌‌‌
  • 2019–20 తో పోలిస్తే తగ్గిన బ్యాంక్ ఫ్రాడ్స్‌‌

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌, వెలుగు: దేశంలో బ్యాంక్ ఫ్రాడ్స్‌‌ బాగా పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2020–21 లో సగటున రోజుకి  229 బ్యాంక్ ఫ్రాడ్స్ జరిగాయని ఆర్‌‌‌‌బీఐ డేటా ద్వారా తెలుస్తోంది.  ఏడాది మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే 83 వేల బ్యాంకింగ్‌‌ ఫ్రాడ్స్ జరిగాయి. ఆర్‌‌‌‌టీఐ కింద ఇండియా టుడే ఈ డేటాను సేకరించింది.  ఆర్థిక సంవత్సరం 2019–20 లో సగటున రోజుకి 231 బ్యాంకింగ్ ఫ్రాడ్స్‌‌ జరిగాయి. దీంతో  పోలిస్తే 2020–21 లో బ్యాంక్ ఫ్రాడ్స్ కొద్దిగా తగ్గాయి. ఈ బ్యాంక్ ఫ్రాడ్‌‌ల వలన  కిందటి ఆర్థిక సంవత్సరంలో  రూ. 1.38 లక్షల కోట్లను బ్యాంకులు నష్టపోగా, 2019–20 లో జరిగిన బ్యాంక్ ఫ్రాడ్స్‌‌ వలన ఏకంగా రూ. 1.85 లక్షల కోట్లను నష్టపోయాయి. బ్యాంకులు రికవరీ చేసింది కూడా చాలా తక్కువగానే ఉంది.  2020–21 లో బ్యాంక్ ఫ్రాడ్స్‌‌ వలన నష్టపోయిన డబ్బుల్లో కేవలం ఒక శాతం, అంటే రూ. 1,000 కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగాయి.  2019–20 లో ఫ్రాడ్స్‌‌ వలన నష్టపోయిన డబ్బుల్లో 8.7 శాతం అమౌంట్ రికవరీ అయ్యింది. 

గత 14 ఏళ్లలో రూ. 5.3 లక్షల కోట్ల నష్టం..
ఆర్‌‌‌‌బీఐ డేటా ప్రకారం, బ్యాంక్ ఫ్రాడ్ కేసులు 2014 తర్వాత ఎక్కువగా నమోదయ్యాయి. 2014–15 నుంచి 2020–21 మధ్య మొత్తం 2,84,819 బ్యాంక్ ఫ్రాడ్ కేసులు రికార్డయ్యాయి. మొత్తం రూ. 5.99 లక్షల కోట్లను బ్యాంకులు నష్టపోయాయి.  ఇందులో రూ. 49 వేల కోట్లు అంటే 9.8 శాతం అమౌంట్‌‌ రికవరీ అయ్యింది. 2007–08 నుంచి 2013–14 మధ్య మొత్తం 29,452 బ్యాంకింగ్‌‌ ఫ్రాడ్ కేసులను గుర్తించగా,   రూ. 31,674 కోట్లను బ్యాంకులు నష్టపోయాయి. ఇందులో రూ. 7,493 కోట్ల (మొత్తం ఫ్రాడ్‌‌లో 23.7 శాతం) ను బ్యాంకులు రికవరీ చేశాయి. కాగా, 2014–15 తర్వాత బ్యాంక్ ఫ్రాడ్‌‌లను గుర్తించడం కూడా బాగా పెరిగింది.  సాధారణంగా ఫ్రాడ్‌‌ జరిగిన తర్వాత ఆ ఫ్రాడ్ బయటపడడానికి కొంత టైమ్‌‌ పడుతుంది. ప్రస్తుతం  ఫ్రాడ్‌‌ జరిగిన తర్వాత ఆ ఫ్రాడ్‌‌ను గుర్తించడానికి సగటున 23 నెలల పడుతోందని  ప్రభుత్వం చెబుతోంది. అదే రూ. 100 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఫ్రాడ్‌‌లను గుర్తించడానికి సగటున 57 నెలలు పడుతోందని వివరించింది.    2007–08 నుంచి 2020–21 మధ్య 3,14,270 బ్యాంక్ ఫ్రాడ్ కేసులను గుర్తించారు.  ఈ టైమ్‌‌లో రూ. 5,30,571.55 కోట్లను బ్యాంకులు నష్టపోయాయి. ఇందులో రూ.56,502.91 కోట్లను రికవరీ చేయగలిగారు. తాజాగా డిజిటల్‌‌ బ్యాంకింగ్ పెరుగుతుండడంతో ఆన్‌‌లైన్ ఫ్రాడ్స్‌‌ కూడా ఎక్కువగానే జరుగుతున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. 

బ్యాంకులకు టోకరా పెట్టి విదేశాలకు..
ఇప్పటి వరకు 33 మంది ఆర్థిక నేరగాళ్లు  బ్యాంకులకు టోకరా పెట్టి విదేశాలకు చెక్కేశారు.  సెంట్రల్‌‌‌‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌‌ (సీబీఐ) డేటాను ప్రభుత్వం పార్లమెంట్‌‌లో బయటపెట్టింది.  విజయ్‌‌ మాల్యా, నీరవ్‌‌ మోడీ, నీషల్‌‌ మోడీ, మెహుల్‌‌ చోక్సీ, లలిత్ మోడీ, నితిన్ జే. సందేశర, దిప్తి చేతన్‌‌కుమార్‌‌‌‌ సందేశర వంటి ఆర్థిక నేరగాళ్లు బ్యాంకుల నుంచి రూ. కోట్లల్లో అప్పులు తీసుకొని తిరిగి చెల్లించకుండా విదేశాలకు  చెక్కేశారు. ఈ ఆర్థిక నేరగాళ్లను ఇండియాకు తిరిగి తెచ్చేందుకు చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొంది. వీరికి వ్యతిరేకంగా ఇంటర్‌‌‌‌పోల్ రెడ్ కమర్ నోటిస్‌‌లను కూడా ఇష్యూ చేశామని తెలిపింది. వీరిని తిరిగి ఇండియా పంపాలని ఆయా దేశాలను కోరామని వివరించింది. ‘ మనీలాండరింగ్ యాక్ట్‌‌, 2002 కింద ఈ నెల 10 నాటికి  రూ. 47,099 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మొత్తం 115 కేసులకు సంబంధించి స్పెషల్ కోర్టులలో దర్యాప్తు జరుగుతోంది’ అని ఆర్థిక సహాయ మంత్రి  భగవత్‌‌ కరాడ్‌‌ రాజ్యసభలో అన్నారు.