దసరాకు 5 వేల స్పెషల్ బస్సులు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

దసరాకు 5 వేల స్పెషల్ బస్సులు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
  • ఈ నెల13  నుంచి 25 వరకు ప్రత్యేక సర్వీసులు
  • సాధారణ చార్జీలతోనే టికెట్లు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

హైదరాబాద్, వెలుగు: దసరా పండుగ సందర్భంగా 5,265 స్పెషల్ బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. ఏపీ, కర్నాటక, మహారాష్ట్రకు కూడా స్పెషల్ బస్సులు నడుపుతామని ఆయన ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయన్నారు. వీటిలో 536 సర్వీసులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఈ నెల 22న సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24న దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. అవసరాన్ని బట్టి ఆ రోజుల్లో మరిన్ని ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు. హైదరాబాద్ లో ప్రధాన బస్టాండ్లు అయిన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్​తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్​బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. పండుగ రోజుల్లో ఎంజీబీఎస్-–ఉప్పల్, ఎంజీబీఎస్-–జేబీఎస్, ఎంజీబీఎస్– ఎల్బీనగర్ రూట్లలో ప్రతి10 నిమిషాలకో సిటీ బస్సు ఉంటుందన్నారు.  

ఏ బస్సులు ఎక్కడ్నుంచి?

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 21 నుంచి 23 వరకు అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపు వెళ్లేవి జేబీఎస్, పికెట్ నుంచి.. వరంగల్, హనుమకొండ, జనగామ, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, యాదగిరిగుట్ట బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్ నుంచి.. విజయవాడ, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీ నగర్ నుంచి నడుస్తాయన్నారు. మిగతా సర్వీసులు యథావిధిగా ఎంజీబీఎస్ నుంచే నడుస్తాయని వివరించారు. స్పెషల్ బస్సుల్లో అడ్వాన్స్  రిజర్వేషన్ కోసం సంస్థ వెబ్ సైట్ (tsrtconline.in)లోకి లాగిన్ కావాలని సూచించారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌‌‌‌ఆర్టీసీ కాల్‌‌‌‌ సెంటర్‌‌‌‌ నంబర్ల (040 -69440000, 040- 23450033)లో సంప్రదించాలని పేర్కొన్నారు.