
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉత్తరకాశి జిల్లాలోని యమునోత్రి ఆలయానికి వెళ్లే మార్గంలో బార్కోట్ ప్రాంతంలోని సిలై బెండ్ ప్రాంతంలో ఆదివారం (జూన్ 29) తెల్లవారుజామున ఆకస్మాత్తుగా సంభవించిన వరదలకు ఓ హోటల్ కుప్పకూలింది. హోటల్లోని 9 మంది కార్మికులు వరదల్లో గల్లంతయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
దీంతో ఉత్తరఖాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో చార్ ధామ్యాత్రను 24 గంటల పాటు తాత్కలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి రోడ్లు క్లియర్ అయ్యే వరకు యాత్రికులు తాము ఉన్న చోటే ఉండాలని, చార్ ధామ్ ప్రదేశాలకు ప్రయాణించకుండా ఉండాలని అధికారులు సూచించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున చార్ధామ్ యాత్రను ఒక రోజు వాయిదా వేస్తున్నట్లు గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. సంబంధిత జిల్లాల పరిపాలన, సహాయక బృందాలను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, రోడ్డు మార్గాలను సమీక్షించిన తర్వాత తదుపరి ప్రయాణానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఆయన ఇచ్చారు. భక్తులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు.
ఉత్తరాఖండ్లో రెడ్ అలర్ట్
జూన్ 30, జూలై 1 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఉత్తరాఖండ్కు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సహయక బృందాలను అలర్ట్ చేసింది.