
వికారాబాద్ జిల్లా పరిగి బీఆర్ఎస్ పార్టీలో కోల్డ్ వార్ బయటపడింది. చౌడాపూర్ మండలంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమేళనంలో ఎమ్మెల్యే కార్యకర్తల సాక్షిగా నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేశారు. తమ కుటుంబం పదవులు వదులుకుంటే పార్టీలో కొందరు వాటిని అనుభవిస్తున్నారని ఆరోపించారు. గతంలో కుల్కచర్ల జడ్పీటీసీ అవకాశం వస్తే తాను వదులుకోవడం వల్లే మనోహర్ రెడ్డి జడ్పీటీసీ అయ్యారంటూ అనిల్ రెడ్డి కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఇప్పుడు అనుభవిస్తున్న డీసీసీబీ చైర్మన్ పదవి కూడా తన అన్న ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వల్లే వచ్చిందని అన్నారు.
అనిల్ రెడ్డి వ్యాఖ్యలపై మనోహర్ రెడ్డి ఘాటుగా స్పందించారు.ఎవరి పదవి ఎవరు అనుభవించరని.. కష్టపడితేనే పదవులు వస్తాయని సమాధానమిచ్చారు. జడ్పీటీసీగా ఎన్నికైన రోజు ఇతర పార్టీల నుండి తీవ్రంగా ఒత్తిడి ఉందని.. పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నందుకు అప్పుడు తన ఇంటినే కూల్చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల సాక్షిగా డీసీసీబీ ఛైర్మన్ పదవి కోసం ఎవరు ముందుకు రాకపోతే, తను ముందుకు వచ్చి ఖర్చు భరించి ఛైర్మన్ గా ఎన్నికయ్యానని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఇద్దరి నేతల విమర్శలు ప్రతివిమర్శలతో కార్యక్రమానికి హాజరైన కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.
గత కొద్ది రోజులుగాఎమ్మెల్యే మహేష్ రెడ్డి, మనోహర్ రెడ్డి మధ్య వర్గపోరు నడుస్తోంది. ఇద్దరు వేర్వేరుగా నువ్వా నేనా అన్నట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో చౌడపూర్ మండలంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు, మనోహర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్థానికంగా దుమారం రేపాయి.