జైలుకి పంపించిందన్న కక్షతో మహిళపై గొడ్డలితో దాడి.. పరిస్థితి విషమం

జైలుకి పంపించిందన్న కక్షతో మహిళపై గొడ్డలితో దాడి.. పరిస్థితి విషమం

రంగారెడ్డి జిల్లా: త‌న‌పై న్యూసెన్స్ కేసు పెట్టి జైలుకి పంపించింద‌న్న క‌క్ష‌తో ఓ ఉన్మాది  మహిళపై గొడ్డ‌లితో దాడికి పాల్ప‌డ్డాడు. ప్ర‌స్తుతం ఆ  మహిళ చావుబ‌తుకుల్లో ఉంది. మీర్ పేట్ పీఎస్ పరిధిలోని గుర్రంగూడ టీచర్స్ కాలనీలో ఈ దారుణం జ‌రిగింది. విమ‌ల అనే మహిళను గ‌తంలో రాహుల్ గౌడ్ అనే  వ్యక్తి లైంగిక వేధింపులకు  గురిచేశాడు .  అవి భరించలేక విమల అత‌నిపై మీర్ పేట్ పీఎస్ లో 354 న్యూసెన్స్ కేసు పెట్టి జైల్‌కి పంపించింది. దీంతో విమలపై రాహుల్ కక్ష పెట్టుకున్నాడు. జైల్ నుంచి వచ్చిన రాహుల్ గౌడ్ గతాన్ని మనసులో ఉంచుకుని మంగ‌ళ‌వారం విమల నివాసానికి వెళ్లి ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు విమలను స్థానిక ఆస్పత్రికి తరలిచారు.

ఘటన అనంతరం రాహుల్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు దాడి సమాచారాన్ని పోలీసులకు అందించడంతో.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాహుల్‌ను పట్టుకోవడానికి 4 పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది.