హర్యానాలో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా

హర్యానాలో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా

అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీస్ ఆఫీసర్‌ను ట్రక్కు ఎక్కించి హత్య చేసింది మైనింగ్ మాఫియా. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో ఉన్న నుహ్ పచ్‌గావ్ పరిధిలో మంగళవారం (జులై 19న) జరిగింది. మెవాట్ డీఎస్పీగా పని చేస్తున్న సురేంద్ర సింగ్‌  బిష్ణోయ్ కు ఈ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ జరుగుతుందన్న సమచారం అందింది. దీంతో మైనింగ్‌ను అడ్డుకునేందుకు డీఎస్పీ ఆ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ అక్రమంగా రాళ్లను తరలిస్తున్న ఒక ట్రక్కు వెళ్తుండటం గమనించాడు. ఆ ట్రక్కును ఆపాల్సిందిగా సూచించాడు. కానీ, డ్రైవర్ ట్రక్కును ఆపకుండా, పోలీస్‌పైకి ఎక్కించాడు.

భారీ రాళ్లతో ఉన్న ట్రక్కు శరీరంపై నుంచి వెళ్లడంతో డీఎస్పీ సురేంద్ర సింగ్‌ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత డ్రైవర్‌తోపాటు నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సురేంద్ర సింగ్ త్వరలో రిటైర్ అవ్వాల్సి ఉంది. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. మైనింగ్ మాఫియా నిందితులను విడిచిపెట్టబోమని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు.