భూపాలపల్లి రూరల్ వెలుగు : భూపాలపల్లి మండలం దూదేకులపల్లి గ్రామంలో తండ్రిని చంపిన కొడుకు మూడ్రోజుల పాటు ఇంట్లోనే డెడ్బాడీని దాచాడు. దుర్వాసన భరించలేక శవాన్ని మాయం చేస్తుండగా గ్రామస్తులకు దొరికిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో గుమ్మడి తిరుపతి తన కొడుకు(మైనర్)తో కలిసి ఉంటున్నాడు. తిరుపతి భార్య సంవత్సరం కింద చనిపోవడంతో ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి పెద్ద గొడవ జరగడంతో కోపంతో కొడుకు తీవ్రంగా కొట్టడంతో తిరుపతి(48) చనిపోయాడు.
డెడ్బాడీని ఇంట్లో దాచిపెట్టిన కొడుకు ఏమి తెలియనట్లే ఊరివాళ్లతో ప్రవర్తించాడు. చనిపోయి మూడు రోజులు కాగా శవం నుంచి దుర్వాసన వస్తుండడంతో ఆదివారం పొద్దున దుప్పట్లో చుట్టుకొని బైక్పై వేసుకుని దగ్గరలో ఊర చెరువులో పడేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన గ్రామస్తులు అతన్ని నిలదీయడంతో తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు డెడ్బాడీని పోస్టుమార్టం తరలించారు.